తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రోజు కేసీఆర్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం కేసీఆర్ కేబినెట్ లో ఆయన సహా 18 మంది మాత్రమే ఉండాలి. ఈ నేపథ్యంలో ఆయన తన కేబినెట్ లోనికి ఎవరెవరిని తీసుకుంటారన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. గత కేబినెట్ లో మహిళకు స్థానం లేకపోవడంపై పలు విమర్శలు, వ్యాఖ్యలు వచ్చిన నేపథ్యంలో ఈ సారి కేసీఆర్ కేబినెట్ లో మహిళకు అవకాశం ఇస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మండలి, అసెంబ్లీలో టీఆర్ఎస్ కు సంపూర్ణ మెజారిటీ ఉన్న నేపథ్యంలో మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న ఆశావహుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఆశావహులు ఎందరున్నా…కేసీఆర్ కేవలం 17 మందికి మాత్రమే కేబినెట్ లో స్థానం ఇచ్చే అవకాశం ఉంది. అన్ని సమీకరణాలను పరిగణనలోనికి తీసుకుని కేబినెట్ కూర్పు చేయడం కేసీఆర్ కు కత్తిమీద సామన్న అభిప్రాయం వ్యక్తమౌతున్నది. ఏది ఏమైనా పూర్తి స్థాయి కేబినెట్ ప్రకటించడానికి కేసీఆర్ మరి కొంత సమయం తీసుకుంటారని భావిస్తున్నారు. కోర్టు తీర్పు మేరకు వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిన నేపథ్యంలో కనీసం ఆ శాఖ మంత్రి విషయంలో కేసీఆర్ వెంటనే నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. వీలు అయితే ఈ రోజే తనతో పాటుగా ఆ శాఖ మంత్రిని కూడా ప్రకటించే అవకాశాలున్నాయన్న భావన కూడా వ్యక్తమౌతున్నది. మరో వైపు ఎంఐఎంతో బంధం మరింత పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న కేసీఆర్ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం.
previous post
next post