Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో గత నెల 10వ తేదీ నుండి రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రత కారణంగా చంద్రబాబు ఎలర్జీతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను పరీక్షించిన జీజీహెచ్ వైద్య నిపుణులు చల్లని వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు వివిధ రకాల మందులను సిఫార్సులు చేశారు.
కానీ జైల్ లో ఏసీ పెట్టేందుకు ప్రిజన్ రూల్స్ ఒప్పుకోవని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ మీడియాకు వెల్లడించారు. ప్రత్యేక కేసుగా పరిగణించి కోర్టు ఆదేశిస్తే అప్పుడు పరిశీలిస్తామని ఆయన తెలిపారు. దీంతో ఇవేళ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఆయన ఆరోగ్యంపై ఏసీబీ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ప్రభుత్వ వైద్యులు సూచనలను జైలు అధికారులు పాటించేలా చూడాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా .. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి .. వైద్యులతోనూ, జైళ్ల శాఖ అధికారులతోనూ మాట్లాడారు.
చంద్రబాబుకు స్కిన్ ఎలర్జీ మాత్రమే ఉందని వైద్యులు తెలిపారు. స్కిన్ ఎలర్జీ కాకుండా మరే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని న్యాయమూర్తి ప్రశ్నించగా, మరే రకమైన ఆరోగ్య సమస్యలు చంద్రబాబుకి లేవని వైద్యులు న్యాయమూర్తికి తెలిపారు. దీంతో వైద్యుల సూచనలకు అనుగుణంగా చంద్రబాబు బ్యారక్ లో చల్లదనం ఉండేలా టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. జైలులో ఆయనకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.