మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువస్తున్నా మహిళలపై దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎపిలోని అనంతపురం జిలాల్లో ఓ యువతిని ప్రేమికుడే దారుణ హత్యకు చేయగా తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో నేడు ఓ వితంతు మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండాకు చెందిన భూక్యా స్వాతికి అదే మండలం డబ్బా గ్రామానికి చెందిన రవి అనే యువకుడితో అయిదేళ్ల క్రితం వివాహం జరిగింది. స్వాతి భర్త రవి ఆరు నెలల క్రితం మృతి చెందాడు. కాగా ఇటీవల ఓ వివాహా కార్యక్రమానికి హజరయ్యేందుకు స్వాతి పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఈ రోజు పనిమీద స్వాతి మెట్పల్లి వెళ్లి సాయంత్రానికి తండా బస్టాండ్కు చేరుకుంది. అక్కడ నుండి తన ఇంటికి వెళుతుండగా బైక్ పై హెల్మెట్ ధరించిన ఉన్న గుర్తు తెలియని వ్యక్తి ఆమె ముఖంపై యాసిడ్ పోసి పరారు అయ్యాడు. ఆ యాసిడ్ దాడితో స్వాతి ముఖం కుడి భాగం కాలిపోయింది. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను స్థానికులు వెంటనే మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై వెంటనే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. జిల్లా ఎస్పీ సింధు శర్మతో ఫోన్ లో మాట్లాడారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఎస్పీకి సూచించారు. ఎస్పీ సింధు శర్మ హుటాహుటిన బాధితురాలు చికిత్స పొందుతున్న మెట్పల్లిలోని ఆసుపత్రికి బయలుదేరారు.