Actor Suman: టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ యూటర్న్ తీసుకున్నారు. ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్మోహనరెడ్డి పాలనపై ఇంతకు సుమన్ ప్రశంసలు కురిపించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్ధించారు. జగన్ యే మళ్లీ మళ్లీ సీఎం కావాలని ఆశాభావం కూడా వ్యక్తం చేశారు.
వైసీపీపై పలు సందర్భాల్లో ప్రశంసలు కురిపిస్తుండటంతో సుమన్ త్వరలోనే ఆ పార్టీ లో చేరనున్నారని, రాజమండ్రి లోక్ సభ స్థానం నుండి పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. ప్రస్తుతం రాజమంత్రి లోక్ సభ సభ్యుడుగా ఉన్న మార్గాని భరత్ ఈ సారి అసెంబ్లీకి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ స్థానాన్ని బీసీలకే కేటాయించాలని పార్టీ అధిష్టానం డిసైడ్ అయిన నేపథ్యంలో బీసీ (గౌడ) సామాజిక వర్గానికే చెందిన సుమన్ (తల్వార్ సుమన్ గౌడ్) ను రాజమండ్రి బరిలోకి దించే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వినబడ్డాయి.
రాజమండ్రితో రెండున్నర దశాబ్దాలుగా సుమన్ కు అనుబంధం ఉంది. రాజమండ్రి కేంద్రంగా తన మిత్రుడు నడిపే స్వర్ణాంధ్ర స్వచ్చంద సేవా సంస్థకు 25ఏళ్లుగా సుమన్ గౌరవ సలహాదారుగా ఉన్నారు. ఈ సంస్థ ద్వారా వృద్ధాశ్రమం, బధిరుల పాఠశాల, అనాధులకు నిత్య అన్నదానం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
దీంతో రాజమండ్రి లోక్ సభ స్థానం నుండి సుమన్ పోటీ చేస్తే ఆ లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ప్రభావం ఉంటుందనీ, ఈ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో బీసీ సామాజిక వర్గ ఓటింగ్ ఎక్కువ ఉండటంతో సామాజిక సమీకరణతో పాటు సుమన్ వ్యక్తిగత సినీ చరిష్మా పార్టీకి అదనపు బలం అవుతుందని ఆ పార్టీ నేతలు భావించారని వార్తలు వచ్చాయి. పలువురు వైసీపీ నేతలు సుమన్ తో ఎన్నికలో పోటీ అంశంపై చర్చలు జరపగా సానుకూలంగా స్పందించారని కూడా ప్రచారం జరిగింది.
అయితే అనూహ్యంగా ఇటీవల వైసీపీ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ను లోక్ సభ అభ్యర్ధిగా ప్రకటించింది. దీంతో హర్ట్ అయ్యారో లేక మరేదైనా కారణం ఉందోమో కానీ సుమన్ ఏపీ రాజకీయాలపై యూటర్న్ తీసుకున్నట్లు ఆయన వ్యాఖ్యల బట్టి అర్ధం అవుతోంది. ఆదివారం తిరుపతి తాతయ్యగుంటలోని గంగమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
ఏపీలో సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే టీడీపీ – జనసేన కూటమి గెలుపు ఖాయమని సుమన్ పేర్కొన్నారు. రాజకీయాల్లో చంద్రబాబు తనకు గురువు అని అన్నారు. పరిపాలన బాగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే బాగుంటుందని ఆకాంక్షించారు. ఓటర్లు ప్రలోభాలకు గురి కావొద్దని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు.
ఇప్పుడే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన తనకు లేదని, భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలోనైనా చేరవచ్చని అన్నారు సుమన్. జాతీయ పార్టీలు కూడా ఉన్నాయని అన్నారు. సీనియర్ సిటిజన్ల సమస్యలపై పాలకులు దృష్టి పెట్టి వారికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు రాజమండ్రి నుండి పోటీ చేయాలని ఆఫర్ చేశాయని, తానే తిరస్కరించినట్లు చెప్పారు. తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.