Amith Shah: తిరుపతిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. సమావేశంలో స్వాగతోపన్యాసం చేసిన ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్ర విభజన సమస్యలను ప్రస్తావించారు. ప్రత్యేక హోదా హామీ నెరవేర్చలేదని జగన్ గుర్తు చేశారు. రాష్ట్రాల మధ్య సమస్యలను నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని కోరుతూ.. సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని వేయాలని కోరారు సీఎం జగన్. విభజన రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందనీ, రాష్ట్రాన్ని విడగొట్టి ఏడు సంవత్సరాలు దాటినా హామీలు ఇంకా అమలు కాలేదని తెలిపారు. హామీలను నెరవేర్చకపోవడం విభజన చట్టాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్దారణ లో 2013-14 ధరల సూచీతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. రిసోర్స్ గ్యాప్ నూ భర్తీ చేయలేదని జగన్ చెప్పారు. విభజన హామీలు నెరవేరకపోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు జగన్. తెలంగాణ నుండి విద్యుత్ బకాయిలను ఇప్పించి తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపి డిస్కంలకు ఊరట నివ్వాలని కోరారు. గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోత విధిస్తున్నారనీ, దీనిపై జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రేషన్ లబ్దిదారుల గుర్తింపుపై కేంద్ర ప్రక్రియ హేతుబద్దత లేదన్నారు. దీనిపై వెంటనే సవరణలు చేయాలని జగన్ కోరారు.
Amith Shah: ఈ సమస్యలు జాతీయ అంశాలు
ఏపి సీఎం జగన్ వివరించిన సమస్యలపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు. సీఎం జగన్ చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకుంటామనీ, ఏపి, తెలంగాణ సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అమిత్ షా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలు రాష్ట్రాలకు చెందినవి మాత్రమే కాకుండా ఇవి జాతీయ అంశాలని వ్యాఖ్యానించారు.
కాగా దక్షిణాది రాష్ట్రాలన్నీ తమ సమస్యలను కేంద్ర మంత్రి, సదరన్ జోనల్ కౌన్సిల్ చైర్మన్ అమిత్ షాకు విన్నవించుకున్నాయి. సమస్యలన్నింటినీ విన్న సమావేశం అనంతరం ట్విట్టర్ వేదికగా షా స్పందించారు. ‘దక్షిణాది రాష్ట్రాల 51 అంశాలలో 40 పరిష్కారమయ్యాయి’ అని కేంద్ర మంత్రి షా ట్వీట్ చేశారు.