ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వరుసగా వివాదాలు అవుతున్నాయి. కొన్ని కోట్ల వరకు వెళుతుంటే కొన్ని పున సమీక్ష వరకు వెళ్తున్నాయి. తాజాగా జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులపై టోల్ వసూలు చేయాలని నిర్ణయించింది. ప్రతి లారీ కు బస్సు కు 30 రూపాయల మేర (ఒకవైపు ) టోల్ ఫీజు లను నిర్ణయించారు. అయితే ప్రతి ఇరవై కిలోమీటర్లకు టోల్ గేట్లు పెట్టాలని భావిస్తున్నట్లు తో ఆంధ్రప్రదేశ్ లారీ యజమానుల సంఘం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో భారీగా ఉన్న పెట్రోల్ ధరలకు తోడు ఇప్పుడు టోల్ ధరలను విపరీతంగా పెట్టడం వల్ల తాము వ్యాపారాలు చేసుకోలేమంటూ లబోదిబోమంటున్నారు.
సెస్ వసులు చేస్తున్నారుగా!
రాష్ట్రంలో రెండు వరుసల రోడ్లపై టోల్ వసూలు నిలిపివేయాలని ముఖ్యమంత్రి జగన్ కు లారీ యజమానుల సంఘం లేఖ రాసింది. రెండేళ్లుగా రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని …కరోనా, లాక్ డౌన్ వల్ల మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని లేఖలో పేర్కొన్నారు. టోల్ వల్ల ప్రజలు, రైతులు, రవాణా రంగంపై పెనుభారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికే లీటర్ డీజిల్ పై రూపాయి 22 పైసల చొప్పున రోడ్ సెస్ వసూలు చేస్తోందని విన్నవించారు. ఇప్పుడు మళ్లీ టోల్ వసూలు చేయడం అన్యాయమని వాపోయారు. 2005లో అప్పటి సీఎం వైఎస్ఆర్ బ్రిడ్జిలపై టోల్ టాక్స్ రద్దు చేశారని లేఖలో గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో టోల్ విధించడం తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ ఆలోచన విరమించుకోవాలని సీఎంకు విన్నవిస్తున్నారు. తండ్రి తగ్గించిన టోల్ ను జగన్ ఇప్పుడు పెంచడంపై లారీ యజమానుల సంఘం నాయకులు గుర్రుగా ఉన్నారు.
రాజకీయ మలుపు
టోల్ గేట్లు నిర్మాణం, వసూళ్లపై రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే దీన్ని రాజకీయంగా వాడుకునేందుకు టిడిపి రంగం సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని 27 రాష్ట్ర రహదారులపై ప్రతి ఇరవై కిలోమీటర్లకు టోల్ వసూలు చేస్తే అది పెను భారం అవుతుందని, దీనివల్ల ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయి అని టీడీపీ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రణాళిక వేస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని చంద్రబాబు ఇప్పటికే పార్టీ పెద్దలకు సూచించారు. దీనికి లారీ యజమానుల సంఘం మద్దతు ఉంటుంది. దీంతో ప్రభుత్వానికి మరో గండం పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రోడ్లను కనీసం సరిగా వేయలేని ప్రభుత్వం టోల్ వసూలుకు ముందుకు రావడంపై ప్రజల మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు పాడైపోయాయి. అయితే వీటికి మరమ్మతులు చేయాలని ప్రభుత్వం నిధుల లేమి వల్ల చేయలేకపోతోంది. అయితే టోల్ వసూలుకు ముందుకు రావడంపై ప్రతిపక్షాలు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని రాజకీయం చేయాలని చూస్తున్నాయి. జగన్ ప్రభుత్వం పై వదులుతున్న మరో అస్త్రం ఈసారి ఎలా పని చేస్తుందో వేచి చూడాలి.