ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన విషయంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా అవినీతి, అక్రమాలు అంటూ తెలుగుదేశం ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే, తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి “చీఫ్ మినిస్టర్ ఈజ్ విత్ యూ… ఎనీ థింగ్ ఇల్లీగల్. ప్లీజ్ డోండ్ హెసిటేట్“ అంటూ తేల్చి చెప్పారు. ఇసుక, మద్యం ఎవరు అక్రమ రవాణా చేసినా వదలొద్దు…ఎవ్వరినీ వదిలిపెట్టాల్సిన అవసరం లేదు అంటూ కలెక్టర్లు, ఎస్పీలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇలా చేయండి
ఎరువుల లభ్యతపై వ్యవసాయ శాఖతో కలెక్టర్లు సమన్వయం చేసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా అందించాలని కలెక్టర్లు, ఎస్పీలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మండల స్థాయిలో ఎంత అవసరం?. ఎంత లభ్యత ఉంది? అన్న అంశాలను పర్యవేక్షించాలని సీఎం నిర్దేశించారు. ఈ నెలలో ఎరువులకు అధిక డిమాండ్ ఉంటుంది కాబట్టి కలెక్టర్లు దీనిపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు.
ఆ ఎస్పీలకు ప్రశంస…
గత సమావేశాల్లో కొన్ని విషయాలు తాను ప్రస్తావించానని, ఆ తర్వాత వాటిపై పత్రికల్లో చదివానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. “కొన్ని సున్నిత అంశాల మీద, ముఖ్యంగా అట్టడుగు వర్గాల కేసులకు సంబంధించి, పోలీసులు అనుసరించిన విధానం, వ్యవహరించిన తీరు బాగుందని కధనాలు చదివాను. వాటికి సంబంధించి సీఐ, ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు స్పష్టమైన మెసేజ్ తీసుకుపోలేకపోతే, మంచి ఫలితాలు రావు. ఆ దిశలో తమ సిబ్బందిని బాగా తీర్చిదిద్దారు“ అంటూ జిల్లాల ఎస్పీలను ముఖ్యమంత్రి అభినందించారు.
అక్రమ రవాణా నియంత్రణే…
మద్యం, ఇసుకపై నిరంతరం పర్యవేక్షణ జరుగుతోందన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాటిపై జిల్లా ఎస్పీలు, ఎస్ఈబీ సిబ్బంది ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారని ప్రశంసించారు. మద్యం ధరలను తగ్గించడం వల్ల స్మగ్లింగ్ జరగకుండా చర్యలు తీసుకున్నప్పటికీ, ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని అన్నారు.
చీఫ్ మినిస్టర్ ఈజ్ విత్ యూ….
మద్యం, ఇసుక అక్రమ రవాణాను ఏ మాత్రం ఉపేక్షించేది లేదని సీఎం వైయస్ జగన్ స్పష్టం చేశారు. దీనిపై మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు. అందుకే ఎవరు ఆ అక్రమ రవాణాకు పాల్పడినా సరే, విడిచి పెట్టవద్దన్న ఆయన.. ‘చీఫ్ మినిస్టర్ ఈజ్ విత్ యూ..ఎనీ థింగ్ ఇల్లీగల్. ప్లీజ్ డోండ్ హెసిటేట్’.. అని స్పష్టం చేశారు. ఎవరైనా మద్యం, ఇసుక అక్రమ రవాణాకు ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. వాటిపై రాజకీయంగా ఎటువంటి ఒత్తిళ్లు రావని ముఖ్యమంత్రి వైయస్ జగన్ పూర్తి భరోసా ఇచ్చారు.