రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అన్నది నానుడి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి కేంద్రంలోని బీజేపీతో కొంత సఖ్యతగానే ఉంది. రాజ్యసభలో అవసరమైన ప్రతి సారి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతు ఇస్తూనే ఉంది వైసీపీ. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి అవసరమైనవి అన్నీ కేంద్రం ఇవ్వకపోయినా కొన్నింటిలో సానుకూలంగా ఉంటోంది. అందులో ప్రధానంగా మూడు రాజధానుల విషయంతో పాటు మరి కొన్ని విషయాల్లో సహకరిస్తూనే ఉంది.
కేంద్రంలో బీజేపీకి ఫుల్ ప్లజ్డ్ మెజార్టీ ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయాన్ని గట్టిగా అడిగి రాబట్టుకోలేమనీ, అడుగుతూ ఉంటామనీ గతంలోనే సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల విషయంలో మాత్రం కేంద్రంతో పెద్ద పేచీనే వచ్చే పరిస్థితి నెలకొని ఉంది. గతంలో కేంద్రం ఆమోదించిన రివైడ్జ్ అంచనాలకు అనుగుణంగా 55వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంటే కేంద్రం మాట తప్పుతోంది. 2014 అంచనాల లెక్కనే నిధులు ఇస్తామంటూ ఇప్పుడు మడతపేచీ పెడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ కూడా రాశారు. అయితే ఆ లేఖపై ఇంత వరకూ కేంద్రం నుండి తిరుగు సమాధానం రాలేదు. కేంద్రంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ రాష్ట్రానికి కావాల్సినవి సాధించుకోవాలన్న ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ఉన్నది. అయితే పోలవరం విషయంలో రాజీ పడే ఉద్దేశంలో వైసీపీ ప్రభుత్వానికి లేదు. ఈ విషయంపై నేరుగా ప్రధాన మంత్రి మోడీతో బేటీ కావాలన్న ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. మోడీ అపాయింట్మెంట్ కోసం ఢిల్లీలో ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని సమచారం.
గత నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధాన మంత్రి మోడీతో వివిధ కీలక అంశాలపై చర్చించారు. ఎన్డీఏలో భాగస్వామ్యం కావాలని మోడీ,షా కోరినా జగన్ సున్నితంగా తిరస్కరించారంటూ వార్తలు వచ్చాయి. అయితే జగన్ ఢిల్లీ టూర్ తరువాత రాష్ట్రంలో బీజెపీ నేతలు కొంత సైలెంట్ అయ్యారు. అప్పటి వరకూ దేవాలయాలపై దాడుల అంశం, తిరుమల డిక్లరేషన్ వ్యవహారం, మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనను భర్తరఫ్ చేయాలంటూ బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో నిరసనలు, ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ కొంత సైలెంట్ అవ్వడంతో వైసీపీని కేంద్రంలోకి ఆహ్వానించి ఉండవచ్చు అన్న ఊహగానాలకు బలం చేకూరుతోంది. ఏది ఏమైనా సీఎం జగన్ మాత్రం పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తీసుకురాకపోతే రాష్ట్రంలో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 2022 ఖరీఫ్ సీజన్ నాటికి పోలవరం ప్రాజెక్టుతో సహా పలు ప్రధాన ప్రాజెక్టులు పూర్తి చేసి తీరుతామని కూడా జగన్మోహనరెడ్డి ఘంటాపథంగా చెప్పారు. అంటే కేంద్రాన్ని ఒప్పించి సాధించుకుంటామన్న ధీమా మాత్రం సీఎం జగన్లో ఉన్నట్లు స్పష్టం అవుతోంది.