AP DSC Notification: ఏపీలో ఎన్నోళ్ల నుండో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మొత్తం 6,100 పోస్టులకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నెల 12 నుండి డీఎస్సీ ప్రక్రియ మొదలు కానుండగా.. ఏప్రిల్ 7తో ముగియనుంది. మొత్తం ఏడు మేనేజ్మెంట్ లలో ఉన్న స్కూళ్లలోని 6100 టీచర్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వీటిలో ఎస్జీటీ పోస్టులు 2,280 ఉండగా, స్కూల్ అసిస్టెంట్ 2,299, టీజీటీ 1,264, పీజీటీ 215, ప్రిన్సిపల్ 42 చొప్పున ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
ఫిబ్రవరి 12 నుండి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా, మార్చి 15 నుండి 30 వరకు రెండు సెషన్స్ లో డీఎస్సీ పరీక్షల నిర్వహణ ఉంటుందని మంత్రి చెప్పారు. మార్చి 31 న ప్రాధమిక కీ విడుదల అవుతుందన్నారు. అలాగే ఏప్రిల్ 1న కీ లో అభ్యంతరాలపై స్వీకరణ ఉంటుందని..ఆ వెంటనే ఏప్రిల్ 2వ తేదీన ఫైనల్ కీ విడుదల చేస్తామని చెప్పారు. ఏప్రిల్ 7న డీఎస్సీ ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
రేపటి నుండి టెట్ ధరఖాస్తుల స్వీకరణ
ఏపీ టెట్ పరీక్షకు ఫిబ్రవరి 8 నుండి 18 వరకూ ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆన్ లైన్ మాక్ టెస్ట్ 19న అందుబాటులోకి వస్తుంది. టెట్ హాట్ టికెట్లు ఫిబ్రవరి 23 నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పరీక్షను ఫిబ్రవరి 27న నుండి మార్చి 9 వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ప్రాధమిక కీని మార్చి 10న విడుదల చేస్తారు. ఈ కీపై మార్చి 11 వరకూ అభ్యంతరాల స్వీకరించి 13న తుది కీ విడుదల చేస్తారు. మార్చి 14న టెట్ ఫలితాలు ప్రకటిస్తారు.