AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ తొలి నుండి తీరని అన్యాయమే చేస్తోంది. రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదా ఇవ్వలేదు. విభజన హమీలను నెరవేర్చడం లేదు. ఏపి, తెలంగాణ మధ్య వివాదాలను పరిష్కరించలేదు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఫైనల్ చేయలేదు. ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలకు భిన్నంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చర్యలు చేపడుతోంది. ఇప్పుడు రాష్ట్రానికి విడుదల చేయాల్సిన రూ.529 కోట్లను గాంధీ గారి ఖాతాలో వేసి పంగనామాలు పెట్టేసింది.
విషయంలోకి వెళితే.. ఏపిలోని గ్రామ పంచాయతీలకు కేంద్రం నుండి 14వ ఆర్ధిక సంఘం నిధులు రూ.529 కోట్లు రావాల్సి ఉంది. ఈ నిధుల విషయంపై రాజ్యసభలో వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి కలిప్ మోరేశ్వర్ పాటిల్ చావు కబురు చల్లగా చెప్పారు. 14వ ఆర్ధిక సంఘం సిఫార్సు చేసిన నిధుల్లో రూ.529 కోట్లు నిధులను విడుదల చేయలేకపోయామన్నారు. ఆర్ధిక సంఘం కాలవ్యవధి ముగియడంతో అవి మురిగిపోయినట్లేనని మంత్రి స్పష్టం చేశారు. ఇక 2022 – 2026 ఆర్ధిక సంవత్సరాల్లో 15వ ఆర్ధిక సంఘం సిఫార్సు చేసిన నిధులను మాత్రం కేంద్రం విడుదల చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.