YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై ఏపీలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే పరిస్థితి లేదు. ఈ రెండు పార్టీలు కేంద్రంలోని బీజేపీకి అనధికార మిత్రపక్షంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో రీసెంట్ గా ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల .. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై గళం విప్పుతున్నారు.
గత కొద్ది రోజులుగా జిల్లాల పర్యటనలు నిర్వహించి అధికార ప్రతిపక్ష పార్టీలను విమర్శించిన వైఎస్ షర్మిల తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై కేంద్రంపై ఒత్తిడి చేయడానికి పూనుకున్నారు. ఈ క్రమంలో విపక్ష నేతలను కలిసి మద్దతు కోరారు. ఈవేళ ఢిల్లీలో దీక్ష చేపట్టారు. ఏపీ భవన్ లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి వైఎస్ షర్మిల దీక్ష చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై అధికార వైసీపీ ఎందుకు మాట్లాడటం లేదు. కేంద్రాన్ని ఎందుకు నిలదీయం లేదు. మీ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటో ప్రజలకు చెప్పాలి అంటూ జగనన్న సర్కార్ ను ప్రశ్నించారు వైఎస్ షర్మిల. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారని, తిరుపతిలో జరిగిన సభలోనూ ప్రధాని నరేంద్ర మోడీ మాట ఇచ్చారన్నారు. విభజన చట్టంలోని హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు.
సీమాంధ్ర ను స్వర్ణాంధ్ర చేస్తామని ప్రధాని చెప్పారనీ, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రజలకు మాట ఇచ్చారని, ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని ఏపీ ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ తరపున తాను అడుగుతున్నానని ప్రశ్నించారు. ఇవేళ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిలిగిపోయిందని అన్నారు. కేవలం ఓటు బ్యాంక్ కోసం ఏవోవో మాయమాటలు చెప్పి వాటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. చివరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని ప్రయత్నిస్తూ మరో సారి ఏపీ ప్రజలకు ద్రోహం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
ఏపీలో బీజేపీకి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే లేకపోయినా ఆ పార్టీయే రాష్ట్రంలో రాజ్యమేలుతోందని విమర్శించారు. సీఎం జగన్ బీజేపీకి గులాంగిరీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట తప్పితే ద్రోహం చేసిన వారు అవుతారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో అందరికీ తెలుసునని అన్నారు. ఈ విషయంలో కఛ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీకి, కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తొలుత ఏపీ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ధర్నా కోసం ఏపీ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తుండగా, ఏపీ భవన్ భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ధర్నా చేయడం కుదరదని వెల్లడించారు. అధికారులతో ఏపీ కాంగ్రెస్ నేతలు వాగ్వివాదానికి దిగారు. ఆ తర్వాత దీక్షను కొనసాగించారు. వైఎస్ షర్మిల ఢిల్లీలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి జాతీయ మీడియా హైలెట్ చేసింది.
Vallabhaneni Vamsi: ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అరెస్ట్ వారెంట్ జారీ