YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ..వైఎస్ వివేకా కేసులో అప్రూవర్ దస్తగిరి వేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. దస్తగిరి పిటిషన్ పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరింది.
హైకోర్టు విధించిన బెయిల్ షరతులు ఆయన ఉల్లంఘించారని తెలిపింది. అవినాష్ రెడ్డి, ఇతర నిందితులు అత్యంత ప్రభావితం చేసే వ్యక్తులు అని సీబీఐ పేర్కొంది. వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక సాక్షి, అప్రూవర్ కాగా, అతనితో పాటు కుటుంబ సభ్యులనూ నిందితులు బెదిరిస్తున్నట్లు దస్తగిరి చెబుతున్నారన్నారు. బెదిరింపులు, ప్రలోభాల నుండి దస్తగిరి, ఇతర సాక్ష్యులను కాపాడాలంటే అవినాష్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరింది.
పిటిషనర్ తరపున న్యాయవాది జడ శ్రావణ్ వాదనలు వినిపించారు. మరో వైపు దస్తగిరికి ప్రాణ హాని ఉందని సీబీఐ వాదించింది. దీనికి ప్రతిస్పందించిన హైకోర్టు..దస్తగిరికి ప్రాణ హాని ఉందని మీరు ఇప్పుడు ఎలా చెబుతున్నారు అని ప్రశ్నించింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లలేదని సీబీఐని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు స్పందించిన సీబీఐ .. సుప్రీం లో బెయిల్ రద్దు చేయాలని సవాల్ చేసే లోపు వివేకా కూతురు సునీత సుప్రీం కోర్టుకు వెళ్లారని, దీంతో సీబీఐ సైతం సునీత పిటిషన్ లో కౌంటర్ దాఖలు చేశామని వివరణ ఇచ్చింది. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 19కి వాయిదా వేసింది.
YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా