YSRCP: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రీసెంట్ గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కిళ్లి కృపారాణి వైసీపీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇవేళ ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గానికి చెందిన పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇకపై వైసీపీలో కొనసాగలేనని ప్రకటించారు.
ఈ నెల 9వ తేదీన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆమంచి తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు తాను వైసీపీ నుండి బయటకు వస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. కొద్ది రోజులు పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జిగా బాధ్యతలు నిర్వహించిన ఆమంచి కృష్ణ మోహన్..అక్కడ పోటీ చేయడానికి అయిష్టతను వ్యక్తం చేశారు. చీరాలలోనే తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ హైకమాండ్ వద్ద పలు మార్లు విజ్ఞప్తి చేశారు. అయితే చీరాల టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ కు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తికి గురైయ్యారు.
ఈ క్రమంలో కొద్ది రోజులుగా నియోజకవర్గంలో ఆయన ఆనుచరులు ఆత్మీయ సమావేశాలను నిర్వహించారు. స్థానికులకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆమంచి ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతుగా నిలుస్తామని అనుచరులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవేళ వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. అయితే ఆమంచి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని వార్తలు వినబడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య శిష్యుడుగా పేరున్న ఆమంచి కృష్ణమోహన్ .. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.
2000 సంవత్సరంలో వేటపాలెం మండల జడ్ పీటీసీ సభ్యుడుగా ఎన్నికైయ్యారు. 2009 లో చీరాల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి స్వతంత్ర అభ్యర్ధిగా విజయం సాధించారు. అనంతరం టీడీపీలో చేరారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో నాటి టీడీపీ అభ్యర్ధి కరణం బలరాం చేతిలో ఓటమి పాలైయ్యారు. అయితే టీడీపీ నుండి గెలిచిన కరణం బలరాం వైసీపీలో చేరడంతో పార్టీ ఇన్ చార్జి బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఈ ఎన్నికల్లో కరణం బలరాం తనయుడు వెంకటేశ్ కు వైసీపీ టికెట్ ఇచ్చింది.
Janasena: రైల్వే కోడూరు జనసేన అభ్యర్ధి మార్పు .. అరవ శ్రీధర్ కు టికెట్