Janasena: రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన అభ్యర్ధిగా అరవ శ్రీధర్ పేరును పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఇంతకు ముందు ఈ నియోజకవర్గానికి యనమల భాస్కరరావు ను అభ్యర్ధిగా ప్రకటించారు. అయితే ఆయన వైసీపీ కీలక నేతలకు అత్యంత సన్నిహితుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుచరుడు అని వార్తలు వచ్చాయి. టీడీపీ, జనసేన నేతల నుండి పార్టీ అధినేతకు ఫిర్యాదులు చేశారు.
క్షేత్ర స్థాయి నుండి వచ్చిన నివేదికలు, జిల్లా నాయకుల అభిప్రాయాలను పార్టీ అధ్యక్షుడు, ముఖ్య నాయకులు పరిశీలించారు. దీంతో ఈ స్థానంలో అభ్యర్ధిని మార్చాలని నిర్ణయించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉన్న సమయంలో రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన, టీడీపీ నేతలు కలిసి నియోజకవర్గంలో పరిస్థితిని వివరించారు. భాస్కరరావు ఏ మాత్రం బలమైన వ్యక్తి కాదని, వైసీపీ విజయం కోసం పని చేస్తారన్న అభిప్రాయానికి రావడంతో అభ్యర్ధిని మార్చాలని నిర్ణయించారు. పార్టీ నేతలు, కూటమిలోని ఇతర పార్టీల నేతల అభిప్రాయాలను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభ్యర్ధిగా అరవ శ్రీధర్ పేరును ఖరారు చేశారు.
అరవ శ్రీధర్ మూడు రోజుల క్రితమే జనసేన పార్టీలో చేరారు రైల్వే కోడూరు నియోజకవర్గం ముక్కావారిపల్లె గ్రామ సర్పంచ్ గా ఉన్నారు. ఆయన టీడీపీ ఇన్ చార్జి ముక్కా రూపానందరెడ్డి స్వగ్రామానికి చెందిన వారు. ఆయన సిఫార్సుతోనే టిక్కెట్ దక్కినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇవేళ ఉదయమే ఆవనిగడ్డ నియోజకవర్గానికి అభ్యర్ధిగా మండలి బుద్ద ప్రసాద్ ను ఖరారు చేసిన విషయం తెలిసిందే.