Bharat Ratna: భారత మాజీ ప్రధాని, తెలుగు తేజం పీవీ నరసింహరావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. అలానే మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్, హరిత విప్లవ నిపుణుడు ఎంఎస్ స్వామినాథన్ కు సైతం భారతరత్న ప్రకటించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.కాగా, ఇటీవలే ..ఎల్ కే అద్వానీ, కర్పూరీ ఠాకూర్ కు కూడా కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. మన మాజీ ప్రధాని పీవీ నరసింహరావు గారిని భారతరత్న తో సత్కరిస్తున్నందుకు సంతోషిస్తున్నానని పేర్కొన్నారు ప్రధాని మోడీ. విశిష్ట పండితుడుగా, రాజనీతిజ్ఞుడిగా భారతదేశానికి పీవీ వివిధ హోదాల్లో సేవలు అందించారని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, అనేక సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడుగా ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. భారతదేశాన్ని ఆర్ధికంగా అభివృద్ధి చేయడంలో ఆయన దూరదృష్టి గల నాయకత్వం కీలకపాత్ర పోషించిందన్నారు. దేశాభివృద్ధికి బలమైన పునాది వేశారన్నారు.
పాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామానికి చెందిన పీవీ నరసింహరావు మంథని నియోజకవర్గం నుండి తన రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. 1957 లో తొలి సారి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత 1962, 67, 72 లో వరుసగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా రెండో సారి గెలిచిన తర్వాత మంత్రిగా అవకాశం వచ్చింది. తొమ్మిది సంవత్సరాల పాటు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖ మంత్రిగా పని చేశారు.
1971లో జరిగిన పరిణామాల నేపథ్యంలో పీవీని కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది. రెండు సంవత్సరాల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగిన ఆయన తర్వాత రాష్ట్ర రాజకీయాలకు స్వస్తిపలికారు. 1977లో హనుమకొండ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరో సారి ఇదే నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్ర లోని రాంటెక్ నుండి ఎంపీగా ఎన్నికైయ్యారు. కేంద్ర కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. 1991 లో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధాన మంత్రి పదవి వరించింది. ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. బహుభాషా కోవిదుడుగా గుర్తింపు పొందారు. పీవీ నర్శింహరావుకు కేంద్రం భారతరత్న ప్రకటించడం పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.