IMA: అల్లోపతి మీద,ఆ క్యాటగిరీ వైద్యుల మీద యోగా గురు బాబా రాందేవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది.అయితే కట్టె విరక్కుండా పాము చావకుండా అన్న ధోరణిని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ బీజేపీకి అనుకూలంగా ఉండే రాందేవ్ విషయంలో ప్రదర్శించారు.ఇష్టానుసారం అల్లోపతి వైద్యాన్ని కించపరిచేటట్లు,ఆ క్యాటగిరీ వైద్యులపై ప్రజలకు దురభిప్రాయం ఏర్పడేటట్లు వ్యాఖ్యలు చేసిన బాబా రాందేవ్ ను ప్రాసిక్యూట్ చేయాల్సిందిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో పోస్టింగ్ ద్వారా నిన్న డిమాండ్ చేయటం తెలిసిందే.దానిపై ఆదివారం స్పందించిన హర్షవర్ధన్ ఇంతటి పెద్ద సమస్య కు అతిచిన్న సొల్యూషన్ చూపించారు!
మంత్రి ఏం చెప్పారంటే?
బాబా రాందేవ్ ను తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాల్సిందిగా లేఖ రాశాను.ఆయన స్పందన కోసం ఎదురుచూస్తున్నా..అంటూ కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆదివారం ట్వీట్ చేశారు.కచ్చితంగా బాబా రాందేవ్ వ్యాఖ్యలు అల్లోపతి వైద్య రంగాన్ని కించపరిచేవిగా ఉన్నాయని మాత్రం ఆయన అంగీకరించారు.ఇంగ్లీషు మందుల వల్ల కరోనా రోగులు వేలసంఖ్యలో చనిపోతున్నారని రామ్దేవ్ అనడం సరికాదని మంత్రి పేర్కొన్నారు. ఐఎంఏ ఆవేదనతో తాను ఏకీభవిస్తున్నానని మంత్రి తెలిపారు.
IMA: ఐఎంఏ అసంతృప్తి !
కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తమ ఆవేదనను అర్థం చేసుకోవడం పట్ల ఐఎంఏ హర్షం వ్యక్తం చేసినప్పటికీ కేవలం వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే చాలునని బాబా రామ్దేవ్ కి సూచించడం పట్ల అసంతృప్తి వెలిబుచ్చారు. ఇష్టానుసారం మాట్లాడిన బాబా రామ్ దేవ్ పై అంటువ్యాధుల చట్టం కింద చర్యలు తీసుకొని ప్రాసిక్యూట్ చేయాలని తాము కోరగా కేవలం ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే చాలునన్నట్లు కేంద్రమంత్రి ఆప్షన్ ఇవ్వడాన్ని వారు ఖండించారు.అల్లోపతి వైద్యుల్లో ఆధునిక హంతకుడిగా రాందేవ్ అభివర్ణించడాన్ని వారు మరోసారి కేంద్ర మంత్రి కి గుర్తుచేశారు.రామ్ దేవ్ వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే చాలదని ,తప్పనిసరిగా ఆయనపై చర్యలు తీసుకోవల్సిందేనని ఐఎంఏస్పష్టం చేసింది.
అసలు జరిగింది ఇదీ!
బాబా రాందేవ్ ఆధునిక వైద్యశాస్త్రాన్ని, వైద్య విధానాలను అవమానించే విధంగా మాట్లాడుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.అందులో అల్లోపతి వైద్యాన్ని రాందేవ్ అవహేళన చేశారు.అల్లోపతి అనేది ఒక పనికిరాని సైన్స్ అంటూ రాందేవ్ వ్యాఖ్యానించారు.అల్లోపతి మందులు తీసుకున్న లక్షలాది మంది కోవిద్ రోగులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.భారత డ్రగ్ కంట్రోలర్ ఆమోదించిన రెమిడిసీవర్,ఫావి ఫ్లూ వంటి మందులు కూడా కూడా కరోనాను నయం చేయలేకపోయాయని రాందేవ్ అన్నారు.అంతకుముందు మరో సందర్భంలో రాందేవ్ వైద్యులనుద్దేశించి ఆధునిక హంతకులని వ్యాఖ్యానించారు.దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భగ్గుమనడం తెలిసిందే .