Chandra Babu : ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈరోజు తాను ప్రాతినిధ్యం వహించే కుప్పం లో పర్యటన చేపట్టారు. ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో వైసిపి మద్దతుదారులు పెద్ద ఎత్తున గెలుపొందడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో టిడిపి పని అయిపోయిందని…. చంద్రబాబు రాజకీయ జీవితానికి ఇది చరమాంకం అని అందరూ అనుకున్నారు.
అసలు అది విజయమే కాదు…!
బాబు అడ్డా లో ఇలాంటి పరిస్థితి ఏర్పడడంతో టిడిపి భవిష్యత్తుపై భారీ ఎత్తున సందేహాలు వ్యక్తమయ్యాయి అయితే చంద్రబాబు మాత్రం ఆ వాదనలు అన్నింటిని కొట్టిపారేశారు. అధికార పక్షం మద్దతుదారులు పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించారన్న ప్రచారంలో అసలు నిజమే లేదన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థులను అధికార పార్టీ వారు అన్ని విధాలుగా భయపెట్టారని ఆరోపించారు. అనేక దౌర్జన్యాలు జరిపించి వారు ఈ విజయాలు సాధించారని…. వీటికే ఇంతగా విర్రవీగుతూ ఉన్నారని ఆయన విరుచుకుపడ్డారు.
ఏడాదిన్నరలో ఎన్నికలు… చక్ర వడ్డీ తో సహా తిరిగిస్తా….
“ఇది కడప అనుకుంటున్నారేమో… కుప్పం. అన్నీ గుర్తుపెట్టుకున్నా…. వడ్డీ కాదు వడ్డీతో సహా తిరిగి ఇస్తాన”ని చంద్రబాబు ఆగ్రహావేశాలకు పోయారు. ఇదే రీతిలో తాము కూడా గతంలో చేసి ఉంటే ఈ పుంగనూరు నేత అసలు ఉండేవారా అని ఆయన మండిపడ్డారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ తాను కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని అన్న బాబు…. ఏడాదిన్నర లో ఎన్నికలు వస్తాయని… అప్పుదు తామేంటో చూపిస్తామనిచెప్పడం గమనార్హం. తన పై కక్ష కట్టి తన నియోజకవర్గంలోని ప్రజలను వైసిపి వారు అన్ని విధాలుగా ఇబ్బందికి గురి చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.
ఇది కడప కాదు… కుప్పం…!
“మీరు భయపెడితే భయపడడానికి ఇది పుంగనూరు…. కడప కాదు… గుర్తుపెట్టుకోండి. మీ ఆటలు ఇక్కడ కాదు” అని బాబు తీవ్రస్థాయిలో విరుచుకు పడడం అందరినీ ఆశ్చర్యానికి నెట్టింది. తెలుగుదేశం పార్టీ నేతలకు, కార్యకర్తలకు చంద్రబాబు అధైర్యం పడాల్సిన అవసరం లేదని పిలుపునిచ్చారు. తాను కుప్పం ప్రజలకు తోడుగా ఉంటానని… తరచూ వస్తుంటానని…. అన్నీ సమస్యలు తెలుసుకుంటారని బాబు మాట ఇచ్చారు.
అయితే కుప్పం నియోజకవర్గంలో వైసీపీ పక్కా ప్లాన్ తో పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించినట్లు తెలుస్తోంది. దౌర్జన్యం, బెదిరింపులు అనే మాట పక్కన పెడితే జగన్ అధికారం చేపట్టిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో భారీ ఎత్తున సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. అలాగే కుప్పం ని మున్సిపల్ కార్పొరేషన్ చేయడం కూడా జరిగింది. మరి బాబు చక్రవడ్డీతో చెల్లించే కాలం ఎప్పుడు వస్తుందో చూడాలి…