గత కొంతకాలంగా వైసిపి రెబల్ ఎంపీ కనుమూరు రఘురామకృష్ణం రాజు రాజకీయంగా ఎటువైపు అడుగులు వేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. 2019 ఎన్నికల్లో చివరి క్షణంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ కండువా కప్పుకున్న రఘురామ కృష్ణంరాజు నరసాపురం నుంచి పోటీ చేసి స్వల్ప మెజార్టీతో టిడిపి నుంచి పోటీ చేసిన అప్పటి ఉండి ఎమ్మెల్యే కలువపూడి శివపై విజయం సాధించారు. అయితే ఎంపీగా గెలిచిన ఏడాదికే వైసీపీ అధిష్టానంతో విభేదించడం ప్రారంభించారు. గత నాలుగు సంవత్సరాలుగా రచ్చబండ పేరుతో ప్రతిరోజు వైసిపి ప్రభుత్వంతో పాటు జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తూ వార్తల్లోకి ఎక్కారు.
చివరకు వైసీపీ అధిష్టానం కూడా రఘురామ కృష్ణంరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. వైసీపీకి దూరమయ్యాక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో సఖ్యతతో ఉంటూ వస్తున్న రఘురామ ఇటు రాష్ట్రంలో జనసేన – టిడిపి కూటమికి అనుకూలంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల జనసేన – తెలుగుదేశం పార్టీ నిర్వహించిన తాడేపల్లిగూడెం సమావేశానికి కూడా ఆయన హాజరయ్యారు. జై టిడిపి.. జై జనసేన.. జై బిజెపి అని నినాదాలు చేయడంతో రఘురామ అడుగులు ఎటువైపు ? పడతాయో తెలియక అందరూ సందిగ్ధంలో ఉన్నారు.
నరసాపురం సీటును పొత్తులో భాగంగా ఏ పార్టీ తీసుకుంటుందో ఆ పార్టీ నుంచే రఘురామ పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే నరసాపురం పార్లమెంటు సీటును తెలుగుదేశం పార్టీ తీసుకోనుందని అక్కడ నుంచే రఘురామను చంద్రబాబు బరిలోకి దింపుతారని తెలుస్తోంది. ప్రస్తుతం రఘురామ పేరుతో నరసాపురం పార్లమెంటు సీటుకు టిడిపి ఐ.వి.ఆర్.ఎస్ నిర్వహిస్తోంది. నరసాపురం నుంచి రఘురామ కృష్ణంరాజు పోటీ చేయడం మీకు ఓకే అయితే ఒకటే నొక్కండి అనే వాయిస్ వినిపిస్తోంది. దీంతో ఆయనను నరసాపురం నుంచి పార్లమెంట్లో బరిలోకి దింపాలని చంద్రబాబు దాదాపు నిర్ణయం తీసుకున్నారన్నట్టాక్ తెలుగుదేశం పార్టీ రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది.
వాస్తవానికి నరసాపురం పార్లమెంట్ సీటును జనసేనతో పాటు బిజెపి కూడా ఆశించాయి. అయితే జనసేనకు అనకాపల్లి – కాకినాడ – బందరు పార్లమెంటు సీట్లు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ జనసేన నుంచి పోటీ చేసిన పవన్ సోదరుడు నాగబాబుకు ఏకంగా 2.50 లక్షలకు పై చిలుకు ఓట్లు పడ్డాయి. ఈ సారి పొత్తులో ఇక్కడ జనసేన పోటీ చేస్తే భారీ మెజార్టీతో గెలుపు గ్యారెంటీ అనుకున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ సీటు జనసేన వదులుకుంది.
ఇక బిజెపికి రాజమండ్రి – రాజంపేట – అరకు – తిరుపతి – విజయవాడ పార్లమెంటు స్థానాలు ఇవ్వాలన్న చర్చలు జరుగుతున్నాయి. అందుకే తెలుగుదేశం పార్టీ నర్సాపురం పార్లమెంటు సీటును తీసుకుంటుందని అక్కడ నుంచే రఘురామ కృష్ణంరాజును బరిలోకి దింపుతుందని తెలుస్తోంది.