ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల కుటుంబానికి టీడీపీ అధినేత చంద్రబాబు పెద్ద టెస్టే పెట్టారని అంటున్నారు పార్టీ నాయకులు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు కండీషన్లతో పరిటాల ఫ్యామిలీలో చిన్నపాటి పొలిటికల్ వార్ కూడా మొదలైంది. ఈ కుటుంబం వచ్చే ఎన్నికల్లో రెండు టికెట్లు ఆశిస్తోంది. రాప్తాడుతోపాటు ధర్మవరం టికెట్ను కూడా తమకే ఇవ్వాలని కోరుతున్నారు. కానీ, చంద్రబాబు రాప్తాడును ఇప్పటికే ఖరారు చేశారు. పైగా.. ఈ టికెట్ నుంచి.. మాజీ మంత్రిపరిటాల సునీత పోటీ చేయాలని ఆయన నిర్దేశించారు. మరి నా కుమారుడు పరిస్థితి ఏంటి? అని ఆమె పంచాయతీ పెట్టారు.
ఇదే విషయాన్ని రెండు రోజుల కిందట చంద్రబాబు దగ్గర ఆమె.. తన కుమారుడిని తీసుకువచ్చి మరీ ప్రశ్నించారు. ధర్మవరంలో గత మూడు సంవత్సరాలుగా బాబు(శ్రీరాం) తిరుగుతున్నారని.. కొన్నాళ్లు పాదయాత్ర కూడా చేశారని.. పార్టీని బలోపేతం చేశాడని.. సునీత కన్నీటి పర్యంతమైనట్టు పార్టీ నాయకులు తెలిపారు. అయితే..చంద్రబాబు మాత్రం తనకు టికెట్ ఇవ్వకూడదన్న ఉద్దేశం లేదని.. కానీ, ప్రత్యర్థి పక్షం బలంగా ఉందని.. అంత బలాన్ని తట్టుకుంటారో లేదో మీరే నిర్ణయించుకోవాలని సూచించారు.
`ఆర్థికంగా మీరు తట్టు కోగలరా? ` అని చంద్రబాబు సునీతను ప్రశ్నించారు. రెండు స్థానాల్లోనూ వైసీపీ బలంగా ఉంటే.. మీరు ఆర్థికంగా రెండు నియోజకవర్గాల్లోనూ తట్టుకుని నిలబడగలరా? అని చంద్రబాబు ప్రశ్నించారని తెలిసింది. అంతేకాదు.. ఆర్థిక అంశాలపై మీ కుటుంబం కూర్చుని చర్చించుకుని నాకు సమాచారం ఇవ్వాలని.. అప్పటి వరకు ధర్మవరంపై నిర్ణయం తీసుకోనని కూడా..చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. విచిత్రం ఏంటంటే ధర్మవరంలో గత ఎన్నికల్లో ఓడిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి పార్టీ మారి బీజేపీలోకి వెళ్లాకే శ్రీరామ్కు ఇక్కడ పార్టీ పగ్గాలు ఇచ్చారు. శ్రీరామ్, సునీత ఈ సారి ఇద్దరూ అసెంబ్లీకే పోటీ చేయాలన్న కోణంలో బాగా కష్టపడ్డారు.
అయితే ఇప్పుడు చంద్రబాబుకు ఈ కుటుంబానికి రెండు సీట్లు ఇవ్వడం ఇష్టంలేదు. దీంతో ఇప్పుడు .. రెండు సీట్ల వ్యవహారం.. సునీత కోర్టులోకి చంద్రబాబు నెట్టేశారు. దీనిపైనే ఆమె తర్జన భర్జన పడుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్నామని చెబుతున్నా చంద్రబాబు వినే పరిస్థితి లేదు. రాఫ్తాడులో సునీతను పోటీ చేయమని బాబు చెపుతున్నారు. అలా అయితే శ్రీరామ్ను పక్కన పెట్టాయాలి. ఈ నేపథ్యంలో సునీత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. తాజాగా ఇరు నియోజకవర్గాల అనుచరులతో, తమకు అనుకూలంగా ఉన్న వ్యాపార వేత్తలతో శుక్రవారం(ఈరోజు) ఆమె భేటీ నిర్వహిస్తున్నారు. మరి చివరకు ఏం తేలుస్తారో చూడాలి.