Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi సినిమాల్లో ఎంతటి క్రేజ్, స్టార్ డమ్ సంపాదించారో తెలిసిందే. ఆయన డ్యాన్స్, ఫైట్స్, కామెడీకి అశేష అభిమానులు ఉన్నారు. అభిమానులు సినిమా ఫంక్షన్లు చేయడం, కటౌట్లు, బ్యానర్లు కట్టడమే కాదు.. సామాజిక బాధ్యత వైపు కూడా వెళ్లాలని వారిని ముందుకు నడిపించారు. ఇందుకు రెండు దశాబ్దాల క్రితమే చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి సేవా భావం వైపు మళ్లారు. రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు తనదైన సాయం చేసారు. వ్యక్తిగతంగా కూడా అవసరమైన వారికి ఎంతో సాయం అందించారు. గతేడాది సినీ కార్మికులను ఆదుకునేందుకు ‘సీసీసీ’ ఏర్పాటు చేసి ఇండస్ట్రీని సంఘటితం చేశారు. ప్రస్తుత కరోనా సమయంలో కూడా ఆయన తన దాతృత్వం చాటుకుంటున్నారు.
‘సీసీసీ’ ద్వారా సినీ కార్మికులు, కుటుంబాలకు వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నిన్న సీనియర్ నటి పావలా శ్యామల ఆర్ధిక పరిస్థితి తెలుసుకుని ఆమెకు ఇకపై ఇబ్బంది లేకుండా లక్ష రూపాయలు ఇచ్చి.. ‘మా’ సభ్యత్వ కార్డు వచ్చేలా చేశారు. దీంతో ఆమె ప్రతినెలా 6వేలు పెన్షన్ పొందనున్నారు. ఇలా ఆదుకుంటున్న చిరంజీవి ఇప్పుడు మళ్లీ తన ఉదారత చాటుకున్నారు. సినీ పరిశ్రమలో పావలా శ్యామలలా ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్నవారి గురించి తెలుసుకుని వారిని ఆదుకునేందుకు మందుకొచ్చారు. మరో 15 లక్షలు విరాళంగా అందిస్తూ.. ప్రస్తుత కష్టకాలంలో ఉన్నవారిని ఆదుకోవాలని తన టీమ్ ను ఆదేశించారు. ఈ సమయంలో వారిని ఆదుకోవడం తక్షణ కర్తవ్యంగా పేర్కొన్నారు.
చిరంజీవి చేస్తున్న సాయానికి ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్న కళాకారులు ఊరట పొందుతున్నారు. ఇవే కాకుండా ఫ్యాన్స్ ఆపదలో ఉన్నారని తెలుసుకుని వారికి అవసరమైన సాయం చేస్తున్నారు. అపోలో సంస్థలతో కలిసి డు-ఇట్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీలు ఏర్పాటు చేసుకున్న సేవా సంస్థతో కలసి ఆక్సిజన్ సిలిండర్లు అందించడం, హాస్పిటల్ బెడ్స్ ఏర్పాటు చేయడం చేస్తున్నారు. ఇందులో మెగాభిమానుల్ని కూడా ఇన్వాల్స్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న సాయానికి ఇండస్ట్రీలో, ఫ్యాన్స్ లో హర్షం వ్యక్తమవుతోంది.