YSRCP: వైసీపీకి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు జనసేనలో చేరనున్నానంటూ ప్రకటించారు. రాబోయే ఎన్నికలకు టికెట్ నిరాకరించడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురైయ్యారు. ఆ ఎమ్మెల్యే ఎవరు అంటే ..చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. చిత్తూరులో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బలిజ సామాజికవర్గానికి చెందిన తనకు వైసీపీ లో గడచిన అయిదేళ్లలో అనేక అవమానాలు ఎదురయ్యాయని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీలో కాపులకు జరుగుతున్న వివక్షను చూసి విసిగిపోయి పార్టీ నుండి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి వైసీపీకి అంకితభావంతో పని చేశానని చెప్పారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చిత్తూరును రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపానన్నారు. పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన తనకు జరగబోయే ఎన్నికల్లో సీఎం జగన్ చిత్తూరు టికెట్ ఇస్తానని మోసం చేశారని అన్నారు. టికెట్ ఇవ్వకపోగా రాజ్యసభ కు పంపిస్తామని చెప్పి వైసీపీ పెద్దలు మరో సారి మోసం చేశారన్నారు.
చిత్తూరులో కాపు భవన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరినా జగన్ స్పందించలేదన్నారు. నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి రూ.29 కోట్లు అడిగినా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. తన సొంత నిర్మాణ సంస్థ జేఎంసీ కన్ స్ట్రక్షన్ ద్వారా వివిధ ప్రాంతాల్లో చేసిన పనులకు బిల్లులు రూ.73 కోట్లు ఆపేశారనీ, కొందరు పెద్దలు .. వారికి అనుకూలమైన వారికి మాత్రమే బిల్లులు మంజూరు చేయించుకున్నారని ఆరోపించారు. ఏపీఐసీసీ చైర్మన్ పదవి ఇస్తామని కూడా చెప్పి మోసం చేశారన్నారు. బలిజలు వైసీపీకి చేసిన అన్యాయం ఏమిటని ప్రశ్నించారు. రాయలసీమలో బలిజలకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. గురువారం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.
చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆరణి శ్రీనివాసులు 2009 ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి నాటి కాంగ్రెస్ అభ్యర్ధి సీకే బాబు చేతిలో ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత పీఆర్పీ ని వీడి టీడీపీలో చేరి చిత్తూరు జిల్లా అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించారు. 2014 ఏప్రిల్ లో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి గా పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి డీకే సత్యప్రభ చేతిలో ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి ఏఎస్ మనోహర్ పై 39వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దాదాపు పదేళ్ల పాటు వైసీపీలో పని చేసిన ఆయన పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు.
Breaking: టీఎస్పీఎస్సీ గ్రూప్ -2, 3 పరీక్షల తేదీల ఖరారు