తెలంగాణాలో కుమారుడు కెసిఆర్ పట్టాభిషేకానికి తండ్రి కేసీఆర్ ఏర్పాట్లు చేస్తున్న సంకేతాలు వెలువడుతున్నాయి.చాలాకాలంగా అతిత్వరలోనే కెసిఆర్ ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకొని కెటిఆర్ ని సీఎం చేస్తారన్న ఊహాగానాలు సాగుతున్నాయి.
ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి కెసిఆర్ వెళ్తారంటున్నారు.అయితే ఇప్పటివరకు గుసగుసలు గానే ఉన్నా సీఎం మార్పు విషయం ఇప్పుడు ఒక మంత్రి స్పష్టమైన ప్రకటనతో బహిరంగం అయిపోయింది.కెసిఆర్ కి అతి సన్నిహితుడైన ఆ మంత్రి త్వరలోనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఉండవచ్చునని లీక్ ఇచ్చారు.
ఎస్ .. అలా జరగవచ్చు అన్న మంత్రి ఈటెల!
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అనివార్యమేనా? కేటీఆర్ సీఎం కాబోతున్నారా?అన్న చర్చ టీఆర్ఎస్ లో కొంతకాలంగా జరుగుతూనే ఉంది.టీఆర్ఎస్ నేతలు.. మంత్రులు ఇప్పటికే పలుమార్లు ఈ విషయాన్ని పలు సంధర్భాల్లో ప్రస్తావించారు.అయితే తొలిసారిగా … ఇప్పుడు అధికారికంగానే కాగా కేటీఆర్ సీఎం అవుతారని, హరీష్రావు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారని రాష్ట్రంలో ముఖ్యనేతగా, రాష్ట్రమంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ దాదాపు స్పష్టం చేశారు.ఇదే తెలంగాణ రాజకీయాల్లో రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేముంది? కేసీఆర్ అందుబాటులో లేనప్పుడు ఇప్పటికే ఆ పాత్రను కేటీఆర్ పోషిస్తున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొనే అన్నీ అర్హతలు ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్యలు సీఎం మార్పు సంకేతాలను సూచిస్తున్నాయి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారతారని, సీఎం కేసీఆర్ స్థానంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం అవుతారని, మార్పు ఉంటే ఉండవచ్చునని, ఇందుకు రకరకాల కారణాలు ఉండొచ్చని అన్నారు. ఒక ప్రముఖ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం మార్పు ప్రచారంపై ఈటల మాట్లాడారు. ‘‘ఉంటే ఉండొచ్చు! తప్పకుండా!! తప్పేముంది?’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో 99శాతం కార్యక్రమాలు మంత్రి కేటీఆర్ చూస్తారని, టీకా ప్రారంభ కార్యక్రమంలోనూ పాల్గొన్నారని, ముఖ్యమంత్రి అందుబాటులో లేని అనేక సందర్భాల్లో ఆ పాత్రను కేటీఆర్ పోషిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
మంత్రి చేత చెప్పించారా?మర్మం విప్పించారా?
కేసీఆర్ నైజం తెలిసిన వారెవరైనా ముఖ్యమంత్రి మార్పు గురించి మాట్లాడ్డానికి సాహసించరు.అతి కీలకమైన వ్యవహారాల్లో వేలు పెడితే దాన్ని కేసీఆర్ కట్ చేస్తారన్న భయం అందరికీ ఉంది.కానీ సీనియర్ మంత్రి ఈటెల రాజేందర్ ఓపెన్ గానే ఈ విషయమై టీవీ చానల్ ఇంటర్వ్యూలో నే మాట్లాడారంటే అందుకు ఆయనకు పై నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.ఈటెల ద్వారానే ఈ వ్యవహారంలో మర్మాన్ని విప్పే ప్రయత్నం జరిగిందంటున్నారు.