అమరావతి: ఇసుక ఇబ్బందుల కారణంగా రాష్ట్రంలో నిర్మాణ రంగం కూదేలు అయింది. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం గత నెల మొదటి వారంలో నూతన ఇసుక పాలసీని తీసుకువచ్చింది. పూర్తి స్థాయిలో ఇసుక రీచ్లు, డంపింగ్ యార్డ్లు ప్రారంభించకముందే గత నెలలో కృష్ణానదికి వరదలు రావడంతో ఇసుక సమస్య యదాతథంగా కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇసుక సరఫరాపై జిల్లా కలెక్టర్లు, ఎస్పిలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఇసుక కొరతను తీర్చాలని ఆధికారులను ఆదేశించారు. ఇసుక సరఫరా, రవాణా బాధ్యతలను జెసి స్థాయి అధికారికి అప్పగించాలని జగన్ అన్నారు. ఇసుక రవాణాకు ముందుకొచ్చిన వారిని తీసుకోవాలనీ, కిలో మీటరుకు నాలుగు రూపాయల 90 పైసలు చొప్పున ఎవరొచ్చినా వారి వాహనాలను వాడుకోవాలనీ జగన్ సూచించారు. వరదల కారణంగా ఇసుక తరలింపు సాధ్యం కావడం లేదని కలెక్టర్లు సిఎంకు వివరించారు.
ప్రతి జిల్లాలో రెండు వేల మంది నిరుద్యోగ యువకులకు కార్పోరేషన్ల ద్వారా వాహనాలు కొనుగోలు చేసేలా చూడాలని జగన్ అదేశించారు. వారికి ఇసుక రవాణా కాంట్రాక్ట్లు ఇచ్చేలా చూడాలని జగన్ సూచించారు. దీని కోసం మార్గదర్శకాలు సిద్ధం చేయాలని జగన్ ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలనీ, గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా కచ్చితంగా కనిపించాలనీ జగన్ అధికారులకు సూచించారు.