ఎన్నికలకు సమయం చేరువ అవుతున్న నేపథ్యంలో అభ్యర్థులు పోటీ పడుతున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఒకే నియోజకవర్గంలో మేమంటే.. మేమే పోటీలో ఉన్నామంటూ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో నియోజకవర్గంలో రాజకీయ సందడితోపాటు.. వివాదాలు కూడా ముదురుతున్నాయి. అదే.. అనంతపురం అర్బన్ సీటు. ఇక్కడ నుంచి వైకుంఠం ప్రభాకర చౌదరి టీడీపీ తరఫున 2014లో పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. గత ఎన్నికల్లోనూ ఆయనకే టికెట్ ఇచ్చినా.. పరాజయం పాలయ్యారు.
వచ్చే ఎన్నికల్లో అనంతపురం అర్బన్ టికెట్ టీడీపీ.. మిత్ర ధర్మంలో భాగంగా జనసేనకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీనికి మానసికంగా సిద్ధమైన వైకుంఠం ప్రభాకర చౌదరి.. పొత్తు ధర్మానికి అందరూ కట్టుబడాలని చెబుతున్నారు. అంతేకాదు.. కొన్నాళ్ల కిందటి వరకుయాక్టివ్గా పనిచేసిన చౌదరి.. ఇటీవల కాలంలో దూకుడు తగ్గించారు. ఇదిలావుంటే.. వైకుంఠం మాట ఎలా ఉన్నప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు మైనారిటీ వర్గానికి చెందిన నాయకులు పోటీ పడుతున్నా రు. టికెట్ త్యాగం విషయంపై మైనంగా ఉన్నప్పటికీ.. ప్రచారం మాత్రం జోరుగా చేసుకుంటున్నారు.
ఓటర్ల పరంగా.. ముస్లిం మైనారిటీలు అనంతపురం అర్బన్లో ఎక్కువగా ఉన్నారు. అదేవిదంగా బలిజ సామాజిక వర్గం కూడా ఎక్కువగానే ఉంది. ఈ రెండు వర్గాల నుంచి కూడా నాయకులు తమకంటే తమకే అంటూ.. ప్రచారం చేసుకుంటున్నారు. టీడీపీకి చెందిన బలిజ నాయకుడు మునిరత్నం ప్రచారంలో దూకుడు చూపిస్తున్నారు. `పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ కేటాయి స్తే.. దాని నుంచి నేను పోటీ చేయడానికి రెడీగా ఉన్నా. నాకుకూడా సుదీర్ఘకాలంగా నియోజకవర్గం ప్రజలతో సంబంధాలు ఉన్నాయి` అని చెబుతున్నారు. అదే సమయంలో ప్రజల్లోకి కూడా వెళ్తున్నారు.
మైనారిటీ వర్గానికి జకీవుల్లా కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తూ.. ప్రజల్లోకి వస్తున్నారు. ఇల్లిల్లూ తిరుగుతూ.. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట.. ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అర్బన్ టికెట్ను మైనారిటీలకు కేటాయించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని ఆయన చెబుతున్నారు. ఇక, ఇదే టీడీపీకి చెందిన గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గౌస్ మొహియిద్దీన్ కూడా ప్రజల్లోకి వస్తున్నారు.
ఈయన టీడీపీ నాయకుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు సన్నిహితుడు కావడం గమనార్హం. దీంతో బాలయ్య తనకు టికెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారని ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తంగా అర్బన్లో ఎవరికివారే.. టికెట్ ప్రకటించుకుని ప్రచారం చేసుకుంటుండడంతో పార్టీ కార్యకర్తలు గందరగోళంలో పడ్డారు.