పదవి పోతే ఎంత బాధగా ఉంటుందో ఏపి టిడిపి మాజీ చీఫ్ కళా వెంకట్రావును చూస్తే అర్థమవుతోంది.ఇప్పటివరకు టిడిపిలో ఒక్క వెలుగు వెలిగిన కళా వెంకట్రావు ఒక్కసారిగా డిమ్ అయిపోయారు.
తన పదవి పోయిందన్న బాధ కంటే తన ప్రత్యర్థికి అది వచ్చిందన్న వేదనే కళా వెంకట్రావుకు అధికంగా ఉందట.సొంత జిల్లా శ్రీకాకుళంలో కూడా తను డమ్మీ అయిపోయానని ఆయన వాపోతున్నారట.ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావును ఇటీవల చంద్రబాబు తప్పించి ఆయన స్థానంలో మాజీ మంత్రి కె.అచ్చెన్నాయుడును నియమించటం తెలిసిందే.కంటితుడుపు చర్యగా కళా వెంకట్రావును టిడిపి పొలిట్బ్యూరో సభ్యుడు గా తీసుకున్నారు.అయితే ఈ పదవి చెప్పుకోడానికి తగ్గ దేనికీ పనికిరాదు. కళా వెంకట్రావు అచ్చెన్నాయుడు లు ఇద్దరూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే.ఇంకా చెప్పాలంటే అచ్చెన్నాయుడు కళా వెంకట్రావు ముందు బచ్చా.అచ్చెన్నాయుడు అన్న ఎర్రన్నాయుడుతో కళా వెంకట్రావు పోటీ పడేవారు.
ఎన్టీఆర్ జీవించినంతకాలం, డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు హవా నడిచినంత కాలం కళా వెంకట్రావుదే టాప్ ప్లేస్. టిడిపిలో సూపర్ స్పీడ్ గా కళా వెంకట్రావు హోంమంత్రి కూడా అయ్యారు.అయితే చంద్రబాబునాయుడు పార్టీ పగ్గాలు చేపట్టి సీఎం అయ్యాక ఆయన వర్గీయుడైన ఎర్రన్నాయుడు ఎదిగిపోయారు. ఈ దశలో కొద్దిగా వెనుకబడ్డ కళా 2009 లో ప్రజారాజ్యం పార్టీలోకి కూడా వెళ్లారు.ప్రజారాజ్యం పార్టీ చాప్టర్ ముగిసిపోయాక ఆయన మళ్లీ టీడీపీలోకి వచ్చారు.చంద్రబాబు ఆయనకు కిరీటం పెట్టారు.తనకు చేతనైనంత వరకు కళా వెంకట్రావు పార్టీని బాగానే లాక్కొచ్చారు.అయితే ఎర్రన్నాయుడు సోదరడు అచ్చెన్నాయుడు ఎప్పుడైతే ఏసీబీ కేసులో జైలుకెళ్లొచ్చాడో ఆ సానుభూతిని క్యాష్ చేసుకోవడానికి చంద్రబాబునాయుడు ఆగమేఘాల మీద కళా వెంకట్రావును తప్పించి అచ్చెన్నాయుడుకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించారు.వేరే వారు ఎవరికైనా ఈ పదవి ఇచ్చుంటే వెంకట్రావు అంత బాధపడేవారు కాదట.తనకు రాజకీయంగా పడని అచ్చెన్నాయుడు దగ్గర పని చేయటం ఆయన నామోషీగా ఫీల్ అవుతున్నారని సమాచారం.
పైగా శ్రీకాకుళం జిల్లాలో ఎర్రన్నాయుడు కొడుకు రామ్మోహన్నాయుడు ఎంపీగానూ తూర్పుగోదావరి జిల్లాలో ఎర్రన్నాయుడు కుమార్తె ఎమ్మెల్యేగానూ ఇక అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే ప్లస్ పార్టీ చీఫ్గా ను ఉండటంతో వారి పెత్తనం విపరీతంగా పెరిగిపోతుందని కళా వెంకట్రావు మధన పడుతున్నారట.పూలమ్మినచోటే కాయలమ్ముకోడం ఏమిటని ఆయన కుంగిపోతున్నారని రాజకీయవర్గాలు చెప్తున్నాయి.ఈ తరుణంలో అసెంబ్లీ స్పీకర్గా కీలక పదవిలో ఉన్న తన తెలుగుదేశం మిత్రుడు తమ్మినేని సీతారాం ద్వారా కళా వెంకట్రావు వైసిపి వైపు అడుగులేసినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.సీతారాం గూడా శ్రీకాకుళం జిల్లా వారే .టిడిపిలో వీరిద్దరూ కలిసి పని చెయ్యటం జరిగింది.ఇద్దరూ కలిసే ప్రజారాజ్యం పార్టీ కి కూడా వెళ్లొచ్చారు.ఆ తర్వాత సీతారాం వైసిపిలోకి వెళ్లిపోగా కళావెంకట్రావు టిడిపిలో ఉండిపోయారు.ఇప్పుడు తన మిత్రుడు రాజకీయంగా బాగా ఇబ్బందుల్లో ఉన్న నేపధ్యంలో కళా వెంకట్రావుకు స్పీకర్ తమ్మినేని సీతారాం స్నేహహస్తం అందించవచ్చునని,ఆయనకు వైసిపి ద్వారాలు తెరిపించవచ్చునని భావిస్తున్నారు.