అమరావతి, జనవరి 8: జన్మభూమి కార్యక్రమాల పట్ల ప్రజల్లో అద్భుత స్పందన ఉంది, మరింత ఉత్సాహంగా అధికారులు పని చేయాలి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీఠ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంగా మంగళవారం ఉదయం జన్మభూమి – మావూరు ఏడవ రోజు కార్యక్రమాలపై ఆయన జిల్లా కలెక్టర్లు, నోడల్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
అన్ని వర్గాల ప్రజల అభిమానం పొందాలి. గ్రామ, వార్డు సభల్లో అభివృద్ధి ప్రణాళికలపై చర్చించాలి. ప్రణాళికలపై కార్యాచరణకు సిద్ధం కావాలి. త్వరితగతిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలి అని పునీఠ సూచించారు.
జన్మభూమిలో పశువైద్య శిబిరాలకు స్పందన బాగుంది. లక్షలాది పశువులకు వైద్యం అందిస్తున్నాం. గ్రామాల్లో పశుగ్రాస సాగు ముమ్మరంగా చేయాలి. పశుగ్రాసం పంపిణీ చేయాలని అధికారులకు ఆయన అన్నారు.
కరువు నివారణ చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలి. నీటి ఎద్దడి ఉన్న చోట్ల తాగునీటిని సరఫరా చేయాలి, వేసవిలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అయన చెప్పారు.
రంగు మారిన ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు పెట్టవద్దు. సక్రమంగా ధాన్యం కొనుగోళ్లు జరపాలి. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష జరిపాం. అవసరాన్ని బట్టి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఆయన ఆదేశించారు.
అంగన్ వాడి కేంద్రాల నిర్వహణలో రాష్ట్రానికి నాలుగు అవార్డులు వచ్చాయి. అందులో రెండు అవార్డులు కృష్ణాజిల్లాకే వచ్చాయనీ, అంగన్వాడీ నిర్వహణలో దేశానికే మనం నమూనాగా ఉండాలని ఆయన అన్నారు.