‘అంఫాన్’ తుఫాన్ పశ్చిమ బెంగాల్ ను అతలాకుతలం చేస్తున్నది. కుండపోతగా వర్షం కురవడంతో కోల్ కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయం జలదిగ్బంధం అయింది. రన్ వే, హ్యాంగర్స్ పూర్తిగా నీట మునిగాయి. వర్షానికి తోడు బలమైన ఈదురు గాలులు వీయడంతో విమానాశ్రయం లోని కొన్ని నిర్మాణాలు దెబ్బతిన్నాయి. పలు విమానాలు ధ్వంసం అయ్యాయి. ఎయిర్ పోర్టులో అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి.
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి దేశ వ్యాప్తంగా మార్చి 25 నుండి లాక్ డౌన్ విధించడంతో ఈ విమానాశ్రయం నుండీ ప్రయాణికుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం కార్గో విమానాలను మాత్రమే నడుపుతున్నారు.
తుఫాన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్ లో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందారు. బలమైన ఈదురు గాలులు, వర్షాల వల్ల వేలాది ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సుమారు 5 లక్షల మందిని పునరావాసకేంద్రాలకు అధికారులు తరలించారు. బెంగాల్ తీరం వెంబడి గంటకు 120 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయడంతో తీవ్ర నష్టం సంభవించింది.