Corona Lockdown: కరోనా వైరస్ విజృంభణను నిరోధించడానికి దేశ వ్యాప్త లాక్ డౌన్ విధించాలని ఐఎంఏ కేంద్రానికి లేఖ రాసిన మరుసటి రోజే ఢిల్లీ సీఎం అరవింగ్ కేజ్రీవాల్ లాక్ డౌన్ పై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఢిల్లీలో లాక్ డౌన్ మంచి ఫలితాలు ఇస్తోందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. లాక్ డౌన్ కారణంగా పాజిటివిటీ రేటు 35 నుండి 23 శాతంకు తగ్గిందని చెప్పిన కేజ్రీవాల్ రాష్ట్రంలో మరో సారి లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ నెల 17వ తేదీ వరకూ లౌక్ డౌన్ ఉంటుందని పేర్కొన్నారు. లాక్ డౌన్ కాలాన్ని తాము వైద్య మౌళిక సదుపాయాలను పెంచుకునేందుకు వాడామని చెప్పారు. అదే విధంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లోని అసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్ల సంఖ్యను పెంచుకునేందుకు వినియోగించామని అన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తగ్గిందన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు యువకులు చాలా మంది వ్యాక్సిన్ వేయించుకుంటున్నారనీ చెప్పారు. వ్యాక్సిన్ కొరత నివారణ కు కేంద్రం సాయం చేస్తుందని ఆశిస్తున్నామన్నారు.
Corona Lockdown: ఐఎంఏ ఏమని సూచన చేసిందంటే..
దేశంలో కరోనా రెండవ దశ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్త లాక్ డౌన్ పెట్టాల్సిన అవసరం ఉందని ఐఎంఏ పేర్కొంది. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసింది. లాక్ డౌన్ విధించడం వల్ల వైరస్ చైన్ ను బ్రేక్ చేయడంతో పాటు కోవిడ్ రోగులకు నిరంతరాయంగా సేవలు అందిస్తున్న మెడికల్ సిబ్బందికి కొంత మేర స్వస్థత చేకూరుతుందని ఐఎంఏ అభిప్రాయపడింది. ఈ సంక్షోభం నుండి బయటపడేందుకు ఇప్పటికైనా మేల్కోనాలంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఐఎంఏ ఘాటుగా లేఖ రాసింది.
కరోనా సెకండ్ వేవ్ వేళ ఆ శాఖ వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యాన్ని కల్గిస్తోందని వ్యాఖ్యానించింది. కేంద్రానికి తమ అసోసియేషన్ ఇచ్చిన సలహాలు, సూచనలు కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో విస్తరిస్తున్న వైరస్ అదుపులోకి తేవాలంటే ప్రణాళికతో కూడిన లాక్ డౌన్ ను విధించాలని ఐఎంఏ విజ్ఞప్తి చేసింది. రాష్ట్రాలు అమలు చేస్తున్న పది పదిహేను రోజుల లాక్ డౌన్ కాకుండా దేశ వ్యాప్త లాక్ డౌన్ అవసరమని పేర్కొంది.
కరోనా కట్టడికి లాక్ డౌన్ పరిష్కారం కాదని ఓ పక్క తెలంగాణ సీఎం కెసిఆర్ వ్యాఖ్యానించిన తరువాత రెండు రాష్ట్రాలు కర్నాటక, తమిళనాడులో అక్కడి సీఎంలు లాక్ డౌన్లను విధించడం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లాక్ డౌన్ సత్ఫలితాలు ఇస్తోందని పేర్కొనడం, ఐఎంఏ కేంద్రానికి ఇదే విషయంపై సూచన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో వరుసగా నాల్గవ రోజు నాలుగు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు దీనిపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.