దేశంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్ధన్ యోజన స్కీమ్ ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజెడీవై) స్కీమ్ కింద తెరిచే జన్ ధన్ అకౌంట్కు మినమమ్ బ్యాలెన్స్ రూల్స్ లేవు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా మహిళలు భర్త చేతి ఖర్చులకు ఇచ్చే డబ్బులను పోపుల డబ్బాలో గానీ చీరల అరలోగానీ దాచుకునే వాళ్లు. ఇప్పుడు బ్యాంకింగ్ సేవలు విస్తృతం కావడం, దానికి తోడు ఎటువంటి డిపాజిట్ లేకుండా జన్ ఖాతా అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది ప్రజలు అకౌంట్లు ఓపెన్ చేసుకొని వాటిని సక్రమంగా వినియోగించుకొంటున్నారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా ఓపెన్ అయిన అకౌంట్ లలో 55 శాతం అకౌంట్లు మహిళలవే కావడం గమనార్హం.
2020 సెప్టెంబర్ 9 నాటికి దేశ వ్యాప్తంగా రూ. 40.63 కోట్ల బ్యాంకు ఖాతాలు ఉండగా వాటిలో మహిళలవి 22.44 కోట్ల కాగా పురుషులవి 18.19 కోట్లు మాత్రమే. గత నెల సెప్టెంబర్ నాటికీ ఈ అకౌంట్లలోని డిపాజిట్ల మొత్తం 8.5శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్ధిక శాఖ నివేదికలో వెల్లడైంది.
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2020 ఏప్రిల్ 1 నాటికి రూ.19వేల కోట్ల సేవింగ్స్ ఉండగా అవి ప్రస్తుతం రూ. ౩౦ వేల కోట్లకు పెరిగినట్లు నివేదికలో పేర్కొన్నది. జనధన్ ఖాతాల్లో దాదాపు మూడు కోట్ల అకౌంట్లలో జీరో బ్యాలెన్స్ లోనే ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది .
ఇప్పటి వరకు జాతీయ బ్యాంకుల్లో 32.48 కోట్ల అకౌంట్ లు ఉండగా వాటిలో లక్ష కోట్లు నగదు ఉంది. రీజినల్ రూరల్ బ్యాంకుల్లో 7.2 కోట్ల అకౌంట్లు ఉండగా సేవింగ్ నగదు 7.2 కోట్లు ఉన్నాయి. అదే విధంగా ప్రైవేట్ బ్యాంకుల్లో 1.27 కోట్ల అకౌంట్ లు ఉండగా నాలుగు కోట్ల సేవింగ్ నగదు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. జాతీయ బ్యాంకుల్లోని అకౌంట్లులోనే ఎక్కువగా నగదు సేవింగ్స్ చేసుకుంటున్నట్లు ఈ లెక్కలను బట్టి తెలుస్తుంది. వీటి సంఖ్య భవిష్యత్తులో ఇంకా పెరగవచ్చని బావిస్తున్నారు.