క్యాసినో హవాలా కేసులో చికోటి ప్రవీణ్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారించారు. మూడు రోజుల క్రితం క్యాసినో నిర్వహకులు చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిల ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు వారి వ్యాపార లావాదేవీలకు సంబంధించి కీలక సమాచారాన్ని గుర్తించారు. పలు దేశాల్లో నిర్వహించిన క్యాసినో ఈవెంట్ లకు సంబంధించి హవాలా లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన వారి సెల్ ఫోన్ కాల్ డేటా, వాట్సాప్ మేసెజ్ లను పరిశీలించారు.
సోదాలు జరిపిన సమయంలో ప్రాధమిక విచారణ జరిపిన ఈడీ అధికారులు ఈ రోజు విచారణకు హజరుకావాలని నోటీసులు జారీ చేయగా, బ్యాంకు స్టేట్ మెంట్స్, నోటీసు కాపీతో చికోటి ప్రవీణ్ ఈడీ కార్యాలయానికి ఉదయం చేరుకున్నారు. ప్రవీణ్ తో పాటు మాధవరెడ్డి, బబ్లు, రాకేష్, వెంకట్ లను ఈ రోజు దాదాపు 11 గంటల పాటు విచారణ జరిపారు. క్యాసినో ఈవెంట్ల నిర్వహణతో పాటు హవాలా రూపంలో నగదు బదిలీలపై ప్రశ్నించినట్లు తెలుస్తొంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలో విచారణ జరిగింది.
అయితే విచారణ అనంతరం ప్రవీణ్ తో సహా ఇతరులు మీడియా వద్ద ఏమి మాట్లాడకుండా వెళ్లిపోయారు. ప్రవీణ్ తో సినీ సెలబ్రిటీలతో పాటు ఏపి, తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులకు సంబంధాలు ఉన్నట్లుగా ప్రచారం జరగడంతో తెలుగు రాష్ట్రాల్లో చికోటి ప్రవీణ్ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. ఏడు నెలల్లో ఏడు దేశాల్లో ప్రవీణ్ క్యాసినో నిర్వహించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. శ్రీలంక,. ఇండోనేషియా, నేపాల్, సింగపూర్. థాయ్ లాండ్ లలో క్యాసినో ఈవెంట్ లు నిర్వహించినట్లు సమాచారం. అయితే ఆయా దేశాల్లో క్యాసినో నిర్వహణకు చట్టబద్దత ఉందన్న వాదన చికోటి ప్రవీణ్ చేస్తుండగా, హవాలా ద్వారా జరిగిన నగదు బదిలీలపైనే ఈడీ దృష్టి సారించినట్లుగా తెలుస్తొంది. ఈ వ్యవహారంలో తదుపరి ఎవరి పేర్లు బయటకు వస్తాయి. ఈడీ ఎవరికి నోటీసులు ఇస్తుంది అనేది తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నడుస్తొంది.