తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా మాజీ మంత్రి వాకాటి సునీతా లక్ష్మారెడ్డి నియమితులైయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. చైర్ పర్సన్ తో పాటు మరో ఆరుగురు సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా కే ఈశ్వరీబాయి, కొమ్ము ఉమాదేవి, షహీనా, గద్దల పద్మ, సుధామ్ లక్ష్మి, కటారి రేవతీరావు నియమితులైయ్యారు. చైర్ పర్సన్ తో సహా సభ్యులందరూ అయిదేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.
సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999, 2004,2009 ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ ప్రభుత్వంలో సునీతా లక్ష్మారెడ్డి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 లో జరిగిన మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో, తరువాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత ఏడాదే ఆమె పార్టీలో చేరినప్పటికీ సీనియర్ నేతగా ఆమెకు పేరు ఉన్న నేపథ్యంలో కేసిఆర్ సర్కార్ ఆమెకు తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవిని అప్పగించింది.