Sonu Sood: కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. చాన్సు చిక్కితే చాలు అమాయకులను దోచుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ప్రముఖుల పేర్లతో వసూళ్లకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రజలంతా దేవుడిగా భావించే మానవతా వాది సోనూసూద్ నీ కేటుగాళ్లు వదల్లేదు. ఆయన పేరుతో డబ్బు వసూళ్లకు దిగారు. ఆపదలో ఉన్నామంటూ అడిగిన వారందరికీ చేతిలో ఎముక లేదన్నట్లుగా సాయం చేస్తూ కరోనా సమయంలో ఎంతోమందికి దేవుడిగా మారారు రియల్ హీరో సోనూసూద్. అలాంటి సోనూసూద్ పేరును వాడుకొని కొంతమంది అత్యాశతో అతి తెలివి ఉపయోగించి డబ్బు వసూళ్లకు తెరతీశారు.
Sonu Sood: నకిలీలను నమ్మి మోసపోకండి!
ఈ విషయాన్ని స్వయంగా సోనూసూదే తెలియజేశాడు.దీనిపై సోనూ ట్విటర్ వేదికగా స్పందించారు.ఇలాంటి నకిలీ ట్వీట్లు, వెబ్ లింకులు, ఫోన్ నంబర్లను నమ్మొద్దని.. ఇవి ఫేక్ అని పేర్కొన్నాడు. నకిలీరాయుళ్లను హెచ్చరిస్తూ వార్నింగ్ అనే క్యాప్షన్ ను ట్వీట్ కు జత చేశాడు. ‘వార్నింగ్’.. ఫేక్ ఫౌండేషన్ అంటూ ఒక పోస్టును ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారు.
నకిలీ ఫౌండేషన్ పోస్ట్ లో ఏం ఉందంటే?
‘‘సోనూసూద్ ఫౌండేషన్కు మీరు విరాళం ఇవ్వాలనుకుంటే ఒక రూపాయి నుంచి మీకు తోచినంత విరాళం ఇవ్వండి. అందుకోసం ఒక ఫోన్పే నంబర్ అందుబాటులో ఉంచుతున్నాం. ఏదైనా అనుమానం ఉంటే హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించండి’ అంటూ నమ్మబలుకుతున్నారు.
ఈ విషయం సోనూసూద్ దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన ప్రజలను అలర్ట్ చేశారు. ఆ పోస్టును తన ఖాతాలో పోస్టు చేసి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు.
గుడి లేని దేవుడు గా మారిన సోనూసూద్!
కరోనా మొదలైనప్పటి నుంచి నిర్విరామంగా పేదలకు సేవ చేస్తూనే ఉన్నారు సోనూ. ఫస్ట్ వేవ్లో ఎందరో వలస కార్మికులను ప్రత్యేక వాహనాల ద్వారా సొంత ఊళ్లకు పంపించారు. ఏకంగా విమానాలే ఎక్కించారు. ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లకు ఉద్యోగాలు కల్పించారు. ఆర్థిక ఇబ్బందుల్లో వారికి డబ్బు సాయం చేశారు. వైద్య సాయం కోరిన వారికి చికిత్స చేయించారు. ఇక సెకండ్ వేవ్లోనూ తన సేవా గుణాన్ని చాటుకుంటున్నారు. తాజాగా ఢిల్లీలో కరోనాతో పోరాడుతూ ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడుతున్న వారి కోసం ఏకంగా విదేశాల నుంచి ఆక్సిజన్ ప్లాంట్ ఆర్డర్ చేశారు. దీంతో సోనూసూద్ ని దేవుడిలా చూస్తున్నారు జనాలు. ఆయనకు గుళ్లు కట్టి పూజలు కూడా చేస్తున్నారు.కానీ మోసగాళ్లు ,వంచకులు ఆయన పేరును కూడా క్యాష్ చేసుకోవడానికి స్కెచ్ వేశారు.