ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశం ఏదైనా ఉంది అంటే.. అది జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయాలు, వాటి పర్యవసానాలు. ఇప్పుడు అందుకు సంబంధించి విశాఖలో రాజధాని శంకుస్థాపనకు మోడీని ఆహ్వానించేందుకు జగన్ ఆహ్వాన పత్రిక కూడా పంపినట్లు ప్రచారం జరుగుతోంది. మోడీని స్వయంగా వెళ్లి ఆహ్వానించేందుకు జగన్ అపాయింట్మెంట్ కోరిన విషయం కూడా కన్ఫర్మ్ అయింది. ఈ సమయంలో అమరావతి మహిళా జేఏసీ, కాంగ్రెస్ నేత, సుంకర పద్మశ్రీ కొన్ని విమర్శాత్మక కామెంట్స్ చేశారు.
ఆమె మాట్లాడుతూ, “విశాఖ లో రాజధాని శంకుస్థాపన కి రావడానికి ప్రధాని మోడీ కి సిగ్గు లేదా?” అని ప్రశ్నించారు. దేశ ప్రధాని హోదాలోనే నరేంద్ర మోడీ అమరావతి నిర్మాణానికి చంద్రబాబు హయాంలో శంకుస్థాపన చేశారు. మళ్లీ అదే రాష్ట్రానికి ఇంకో రాజధానికి శంకుస్థాపన చేసేందుకు ఏ ముఖం పెట్టుకొని వస్తారని ఆమె మోదీని నిలదీశారు. ఒక రాజధాని నిర్మాణానికి తమ భూములను ఇచ్చి ఎంత ఉన్నత మనసుతో ప్రభుత్వానికి తోడ్పడిన రైతులు ఇప్పుడు అదే ప్రభుత్వం చేతిలో మోసపోయి కన్నీరు పెడుతున్నా కూడా మోడీ జగన్ ఒక వ్యక్తి మీద ఉన్న కోపంతో అమరావతిని హత్య చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
బీజేపీ నేతలు, ప్రధాని మోదీ విశాఖలో శంకుస్థాపన కి రావాలి అనుకుంటే… అమరావతిలో మోడీ శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని వాళ్ళ చేతులతోనే తీసేయాలి అని ఆమె డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీకి మూడు రాజధానులoటూ అడ్డగోలు నిర్ణయం తీసుకున్నారని..ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం తప్పు అని త్వరలో న్యాయస్థానాలు తీర్పు ఇస్తాయన్న నమ్మకం తమకు ఉంది అని ఆమె చెప్పారు.
“అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఏపీకి మూడు రాజధానులు పెడుతున్నారో అలాగే మన దేశానికి కూడా రెండో రాజధాని అవసరం.దేశ రాజధాని ఢిల్లీ బాగా దూరంగా ఉంది కాబట్టి , రెండో రాజధానిని దక్షిణ భారతాన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైదరాబాద్ లో రాష్ట్రపతి విడిది ఉంది. అమరావతిలో దేశ రెండో రాజధాని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా !” అని పద్మ తన వాదనను వినిపించారు. మరి… రాజధాని ఏర్పాటు అంత సులువు అయిపోతే ఎవరు దేనికైనా కొత్త రాజధానిని డిమాండ్ చేయవచ్చు.. ఎక్కడైనా నిర్మించవచ్చు కదా…