గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సొంత సెగ్మెంట్ లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేక పోయారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘోరంగా ఫెయిల్ అయ్యారు. అమె సొంత నియోజకవర్గం మహేశ్వరంలో బీజేపీ రెండు డివిజన్లు గెలిచింది.
ఎల్బీనగర్, ముషీరాబాద్, రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో టీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. ఎల్బీ నగర్ లో బీజేపీ ఏకంగా క్లీన్ స్వీప్ చేసేసింది. మంత్రి తలసాని నియోజకవర్గం సనత్ నగర్ లో బీజేపీ సగం డివిజన్లను కైవసం చేసుకుంది.ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మ్ంట్ లో టీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలువలేదు. అక్కడ ఉన్న11 డివిజన్లను బీజేపీ సొంతం చేసుకుంది. లోకల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేక పోయారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన సుధీర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన మనుషులకు టికెట్ ఇప్పించుకునేందుకు సుధీర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ పార్టీ సిట్టింగ్ లకే మళ్లీ టికెట్ ఇవ్వడంతో సుధీర్ రెడ్డి అనుచరులు ఎన్నికల్లో సహకరించలేదని చర్చ జరుగుతోంది.
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని మెజార్టీ అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ విజయం సాధించింది. మంత్రి తలసాని నియోజకవర్గం సనత్ నగర్ లో 3 డివిజన్లలో బీజేపీ, 3 డివిజన్లలో టీఆర్ఎస్ గెలిచాయి. సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లోనూ బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ముషీరాబాద్ పరిధిలో 6 డివిజన్లలో 5 డివిజన్లను బీజేపీ గెలిస్తే, ఒక్క సీటును ఎంఐఎం గెలుచుకుంది. అక్కడ టీఆర్ఎస్ బోణీ కొట్టలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తమ్ముడి భార్య సైతం ఓడిపోయింది. అంబర్ పేట అసెంబ్లీ సెగ్మెంట్ లో మూడు చోట్ల బీజేపీ, రెండు చోట్ల మజ్లీస్ గెలిస్తే టీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఖైరతాబాద్ అసెంబ్లీ పరిధిలో కూడా బీజేపీ ఒక స్థానం గెలుచుకుంది.మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్ లో బీజేపీ మూడు స్థానాల్లో విజయం సాధించింది.
అక్కడ బీజేపీ పట్టు సాధించే అవకాశం ఉందని గుర్తించిన టీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అయినా అన్ని డివిజన్లలో బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. కొన్ని చోట్ల రెండు మూడొందల ఓట్ల తేడాతో ఓడిపోయింది.గ్రేటర్ లో బీజేపీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్ తన అసెంబ్లీ సెగ్మెంట్ లో మెజార్టీ బీజేపీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. అక్కడ 6 డివిజన్లలో 5 స్థానాల్లో బీజేపీ గెలిచింది. సిట్టింగ్ స్థానాన్ని మజ్లిస్ మళ్లీ గెలుచుకుంది. గతంలో ఇక్కడ టీఆర్ఎస్ కు 3 డివిజన్లు ఉంటే.. ఈసారి ఒక్క డివిజన్ కూడా దక్కలేదు. యాకత్ పురా అసెంబ్లీ పరధిలోనూ బీజేపీ రెండుచోట్ల గెలిచింది.కేవలం రెండేళ్లలోనే టీఆర్ఎస్కు హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి పరిస్థితి రావడం పట్ల రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.