సెప్టెంబర్ 1 వచ్చేస్తోంది. అందులో భాగంగా చోటు చేసుకోనున్న పలు మార్పులు ప్రజల ఆర్థిక అవసరాలపై ప్రభావం చూపించనున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు పలు రూల్స్ ను మారుస్తున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 1 నుంచి అన్లాక్ 4.0 కూడా మొదలుకానుంది. అయితే ఆ రోజు నుంచి చోటు చేసుకోనున్న 5 ముఖ్యమైన మార్పులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
1. కరోనా నేపథ్యంలో ఆర్థిక సమస్యల బారిన పడ్డ ప్రజలను ఆదుకునేందుకు ఆర్బీఐ మార్చి నుంచి ఆగస్టు వరకు రెండు విడతలుగా ఈఎంఐ మారటోరియం సదుపాయం కల్పించింది. అయితే ఇప్పుడు ఆగస్టు ముగుస్తోంది. సెప్టెంబర్ వస్తోంది. కానీ మారటోరియాన్ని మాత్రం పొడిగించలేదు. అందువల్ల సెప్టెంబర్ నెల నుంచి జనాలు ఎప్పటిలా ఈఎంఐలు చెల్లించాల్సి వస్తుంది. కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఆర్థిక సమస్యలను ఎదుర్కొనవచ్చు.
2. అన్లాక్ 4.0 నేపథ్యంలో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్లను ఆపరేట్ చేసేందుకు అనుమతులు ఇచ్చారు. దశలవారీగా మెట్రో రైళ్లను ప్రారంభిస్తారు. కానీ ఆ రైళ్లలో ప్రయాణించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
3. ఎల్పీజీ సిలిండర్ ధరలను ప్రతి నెలా మారుస్తున్నారు. అయితే సెప్టెంబర్ 1 నుంచి ఆ ధరలు తగ్గనున్నట్లు తెలుస్తోంది. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కొంత వరకు ఊరట కలిగించేందుకు వంట గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గిస్తారని తెలిసింది.
4. కరోనా నేపథ్యంలో విమానయాన కంపెనీలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. అంతర్జాతీయ సర్వీసులు ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశం లేదు. అయితే దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో టిక్కెట్లు, ఇతర చార్జిలను భారీగా పెంచనున్నట్లు తెలిసింది. ఆ పెంపు సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని సమాచారం.
5. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో మార్చి చివరి నుంచి థియేటర్లు, మల్టీప్లెక్సులను మూసివేశారు. కానీ అన్లాక్ 4.0 లో భాగంగా సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు అనుమతులు ఇచ్చారు. అందువల్ల జనాలు ఆయా ప్రదేశాల్లో మూవీలను చూసేందుకు అవకాశం కలుగుతుంది.