ఈఎస్ఐ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఇటివలే బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. 76 రోజులపాటు ఆయన జైలులో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన కరోనా వైరస్ బారిన కూడా పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు కుటుంబానికి పేరు ఉంది. అన్న ఎర్రన్నాయుడు టీడీపీలో ముఖ్య నేతగా ఉండేవారు. ఆయన మరణానంతరం కుమారుడు రామ్ మోహన్ నాయుడు, తమ్ముడు అచ్చెన్నాయుడు టీడీపీలో క్రియాశీలకంగా మారారు. 2014, 2019ల్లో అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే అయ్యారు. టీడీపీ హయంలో మంత్రిగా పని చేశారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ నుంచి అచ్చెన్నాయుడు బలంగా వాదనలు వినిపించారు. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా ఆయన ప్రసంగం ఉండేది. ఈఎస్ఐ కేసులో అరెస్టు కాకముందు ఉన్న అచ్చెన్నాయుడు ఇకపై కూడా ఇలానే దూకుడుగా ఉంటారా..
ఇంకా అదే దూకుడు కొనసాగిస్తారా..
టీడీపీ హయాంలో ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఈఎస్ఐ పరికరాల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారంటూ ప్రస్తుత జగన్ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. ఈఎస్ఐలో వైద్య పరికరాలు, మందుల కొనుగోలులో స్కామ్ జరిగిందనే ఆరోపణలు మాత్రమే ఇప్పటివరకూ ఆయనపై ఉన్నాయి. అచ్చెన్నాయుడుకు నేరుగా డబ్బులు ముట్టినట్టు గానీ, లబ్ది పొందినట్టు గానీ ఆధారాలు లభ్యం కాలేదు. సాంకేతికంగా చేసిన తప్పే తప్ప నేరా చేసిన తప్పు కనిపించ లేదని ఏసీబీ అధికారులు అంటున్నారు. దీంతో ఆయన తప్పు చేయకపోయినా 76 రోజులు జైలు జీవితం గడిపినట్టు తెలుస్తోంది.
ఇప్పుడు అచ్చెన్నాయుడు గతంలో మాదిరిగా వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రసంగాలు చేస్తారా.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా.. లేదంటే ప్రస్తుత పరిస్థితుల్లో దూకుడు తగ్గించడమే బెటర్ అనుకుంటారా అనేది చూడాల్సి ఉంది. ఏదైమైనా ఆయన మీడియా ముందుకు వచ్చి నిజా నిజాలు చెప్తేనే అసలు విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఆయన బెయిల్ పై ఉన్నందున ప్రస్తుతం రాజకీయాలు, తనపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో మాట్లాడతారా.. లేదా అనేది కూడా ప్రశ్నార్ధకంగా మారింది.