Ayodhya Ram Mandir: అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ కార్యక్రమంగా నిర్వహిస్తొందని కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నెల 22వ తేదీ వైభవంగా అయోధ్యలో నిర్వహించే రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ హజరుకాబోదని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ నేతల నుండే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
తాజాగా గుజరాత్ కు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. విజాపూర్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సీజే చావ్డా .. జనవరి 22న రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ వెళ్లవద్దని తీసుకున్న నిర్ణయాన్ని మొదటి నుండి వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఆయన ఈ రోజు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. శనివారం పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను రెండున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో పని చేశానన్నారు. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంతో దేశం మొత్తం హర్షం వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం వేడుకకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకుందన్నారు.
ఈ నిర్ణయం తనను బాధపెట్టిందనీ అందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో రామ మందిర నిర్మాణం జరిగిందనీ, దీనికి తామంతా మద్దతు ఇవ్వాలన్నారు. కానీ కాంగ్రెస్ లో ఉండటం వల్ల మద్దతు ఇవ్వలేకపోయానని అందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ శంకర్ చౌదరికి సమర్పించినట్లు చెప్పారు. త్వరలో చావ్డా బీజేపీ చేరతారని భావిస్తున్నారు.
అయితే, అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వ్యక్తుల భక్తి విశ్వాసాలకు సంబంధించింది కావడంతో పార్టీ పరంగా కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యక్తం చేయకుండా నేతలు వారి వ్యక్తిగతానికి వదిలివేసి ఉంటే బాగుండేది అన్న మాట ఎక్కువ మంది నుండి వినబడుతోంది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ వ్యక్తిగతంగా, పార్టీ పరంగా బీజేపీ మైలేజీ కోసం ఉపయోగించుకుంటోందన్న వాదన ఉన్నప్పటికీ దాన్ని రాజకీయంగా విమర్శించాలే కానీ..తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల వ్యక్తిగత అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా బాయ్ కాట్ నిర్ణయాన్ని ప్రకటించడంతో సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు.