Omicron: ఇప్పుడిప్పుడే కాస్త కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అనుకునేలోపే కోవిడ్-19 వైరస్ కొత్త వేరియెంట్ “ఒమిక్రాన్” ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది.ఎందుకంటే ఈ వేరియెంట్ త్వరగా వ్యాప్తి చెందుతుండటంతో పాటు చాలా ప్రమాదకరం అని వైద్యులు సూచిస్తున్నారు. విదేశాలలో ఎక్కువగా ఒమిక్రాన్ (omicron) కేసులు నమోదు అవుతున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా పెరుగుతున్న క్రమంలో దక్షిణ మధ్య రైల్వే శాఖ(South Central Railway Department) ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.
కఠిన చర్యలు తీసుకోనున్న రైల్వే శాఖ :
ఈ వేరియెంట్ వ్యాప్తిని అరికట్టడం కోసం ఇప్పటి నుంచే రైల్వే అధికారులు జాగ్రత్తలు పాటించాలని దక్షిణ మధ్య రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది.విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల కారణంగా మనదేశంలో కూడా ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.ఈ నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు రైల్వే శాఖ అధికారులు కఠినమైన చర్యలను అమలుచేయనున్నారు.
కరోనా వాక్సిన్ తప్పనిసరి :
రైలు ప్రయాణం చేసే ప్రతి ఒక్కరితో పాటుగా, ప్రతి రైల్వే కార్మికుడికి టీకాలు వేయించుకుని ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా యధావిధిగా మాస్క్ ధరించాలి. ఒకవేళ మాస్క్ ధరించకపోతే వారికి రైల్వే స్టేషన్లో, రైళ్లలో ప్రవేశం లేదంటున్నారు అధికారులు.అలాగే సామజిక దూరం పాటించడంతో పాటు ఎప్పటికప్పుడు శానిటైజేషన్ కూడా చేసుకోవాలని సూచించారు.
రైల్వే స్టేషన్లో మాస్క్ లేకపోతే ఫైన్:
కేంద్రం ప్రవేశపెట్టిన మార్గదర్శకాల్లో భాగంగా మాస్క్ లేకుండా రైల్వే స్టేషన్ లోగాని, రైలులో గాని ఎవరన్నా కనిపిస్తే వారికి తక్షణమే 500 రూపాయలు జరిమానా విధించనున్నట్లు తెలిపారు. ఎవరయినా సరే రైల్వే స్టేషన్లలో మాస్క్ లేకుండా ఉంటారో వారిని పట్టుకుని మరీ జరిమానా విధిస్తున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో తనిఖీలు మొదలెట్టేసారు. అలాగే కొత్తగా ప్రవేశపెట్టిన ఈ రైల్వే రూల్స్ పట్ల ప్రయాణికులకు అవగాహన కల్పించడం కోసం ఎక్కడిక్కడ ప్రకటనల బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటూ కరోనా మీద పోరాటం చేయాలనీ తెలిపారు.