Indira Devi: టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మహేష్ ఎంతగానో ప్రేమించే తన తల్లి ఇందిరా దేవి (Indira Devi) ఈరోజు కన్నుమూశారు. అనారోగ్యంతో కొద్ది రోజులుగా బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ ఈరోజు మరణించారు. ఇదే ఏడాది జనవరి నెలలో ఇందిరా దేవి పెద్ద కుమారుడు రమేష్ బాబు మరణించాడు. మళ్లీ కొద్ది నెలల సమయంలోనే ఇందిరా చనిపోవడంతో మహేష్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగి తేలుతోంది.
ఇందిరాదేవి గొప్పతనం అది
కృష్ణ, ఇందిరా దేవికి మహేష్ బాబు, రమేష్, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని అనే ఐదుగురు సంతానం కలిగింది. సూపర్ స్టార్ కృష్ణ మామయ్య కూతురు ఇందిరాదేవి. అంటే కృష్ణకు ఆమె వరుసకు మరదలు అవుతుంది. అయితే ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్న నాలుగేళ్ల తర్వాత కృష్ణ విజయనిర్మలను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం తెలిసినా కూడా ఇందిరా కృష్ణపై కోపం చూపించలేదట. అలాగే వేరే వ్యక్తిని పెళ్లాడి లేదు బతికినంతకాలం ఒకరికి మాత్రమే భారీగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇందిరా దేవి ఎక్కువగా ఫంక్షన్లకు, పార్టీలకు వెళ్లరు. ఆమె మీడియాకి తక్కువగా కనిపిస్తారు.
ఆమె నాకు దేవత లాంటిది: మహేష్
ఇందిరా దేవి మరణం పట్ల ప్రస్తుతం సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ ఇందిరా దేవి చాటున పెరిగాడు. కోపం, బాధ, సంతోషం వచ్చినా తన తల్లి దగ్గరికి వెళ్లకుండా మహేష్ అసలు ఉండలేడు. “ఆమె నాకు దేవతలాంటిది. టెన్షన్గా ఉన్నప్పుడల్లా నేను ఆమె ఇంటికి వెళ్లి కాఫీ తాగుతాను. నా టెన్షన్లన్నీ పోతాయి. మా అమ్మతో నాకున్న అనుబంధం అదే’’ అని మహేష్ పలు సందర్భాల్లో చెప్పారు.