జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేయనున్నారనే విషయం స్పష్ట మైంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 సీట్లు ఉంటే.. కేవలం 24 స్తానాలనే ఆయన ఎంచుకున్నారు. వాటిలోనే పోటీ చేయనున్నారు. ఇక, ఇలా కేవలం 24 సీట్లు మాత్రమే ఎంచుకోవడం వెనుక వ్యూహం ఉందని సీనియర్లు అంటున్నారు. కానీ.. మరోవైపు.. పార్టీ శ్రేణుల్లో మాత్రం అసంతృప్తి పెల్లుబుకుతోంది. తీవ్రస్తాయిలో విమర్శలు కూడా చేస్తున్నారు.
దీనికి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బొలిశెట్టి సత్యనారాయణ కూడా మద్దతు ప్రకటించారు. ఎవరూ హ్యాపీగాలేరని ఓ టీవీ చర్చలో చెప్పుకొచ్చారు. కనీసం 50-40 మధ్యలో తాము టికెట్లు ఆశించామని.. కనీసం 35కు తగ్గవని భావించామని ఆయన చెప్పుకొచ్చారు. అయితే.. కేవలం 24 స్థానాలకే పరిమితం కావడం తమకు కూడా జీర్ణించుకోలేని విషయమేనని చెప్పారు. ఇక్కడ మరో లాజిక్ చెప్పుకొచ్చారు. బీజేపీ కలుస్తుందనే వ్యూహంతో 57 స్థానాలను చంద్రబాబు పెండింగులో పెట్టారు.
రేపు ఒకవేళ బీజేపీ కనుక కలవకపోతే.. ఆ సీట్లలోనూ తమకు షేరింగ్ ఉంటుందని సత్యనారాయణ చెబు తున్నారు. ఇది ఎలా ఉన్నప్పటికీ.. ఇప్పటికైతే.. 24కే జనసేన కన్ఫర్మ్ కావాల్సి ఉంటుంది. అయితే.. దీనిని చిన్న సంఖ్యగా జనసేన నాయకులు కార్యకర్తలు భావిస్తున్నా.. పవన్ పక్కా వ్యూహంతోనే 24 తీసుకున్నారనేది విశ్లేషకుల మాట. ఆయన చెప్పినా.. చెప్పకపోయినా.. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పక్కాగా గెలిచే స్థానాలు.. 30కి మించి లేవు. మిగిలిన వాటిలో పోటీ ఇచ్చే అవకాశం ఉందే తప్ప. గెలుపు గుర్రం ఎక్కడం ఈజీ కాదు.
గత ఎన్నికల్లో ఇదే విషయం పక్కాగా తేలిపోయింది. సుమారు 30 నియోజవర్గాల్లోనే జనసేన బలమైన పోటీ ఇచ్చింది. ఆయా నియోజకవర్గాల్లో జనసేన నాయకులకు 10-25 వేల వరకు ఓట్లు వచ్చాయి. మిగిలిన స్థానాల్లో 8 వేల లోపు ఓట్లు మాత్రమే వచ్చాయి. కొన్ని స్థానాల్లో వెయ్యి, రెండు వేలకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో గెలుపు గుర్రం ఎక్కలేని చోట సంఖ్యా బలంతో చేసేది ఏమీ ఉండదని.. వైసీపీకి ఛాన్స్ ఇవ్వడమేనని పవన్ ఓ నిర్ణయానికి వచ్చే వ్యూహాత్మకంగా.. తనను తాను తగ్గించుకోకుండా. .. పార్టీ గౌరవాన్ని పెంచేలా వ్యవహరించారనేది విశ్లేషకుల మాట.