Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నాయి. తమ దేశం పై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయిల్ ప్రకటించింది. ఆ దేశంపై దాడి తప్పదని చెప్పింది. ఇందు కోసం ఆపరేషన్ ఇరన్ ఫీల్డ్ చేపడతామని ఇజ్రాయెల్ రక్షణ బలగాల అధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హాలేవి స్పష్టం చేశారు.
సోమవారం నెవిటమ్ వైమానిక స్థావరంలో ఆయన మాట్లాడుతూ.. మా వ్యూహాత్మక సామర్థ్యాన్ని దెబ్బతీయాలని ఇరాన్ భావించిందన్నారు. ముందెప్పుడూ ఇలాంటివి చోటుచేసుకోలేదని అన్నారు. ఇరన్ ఫీల్డ్ ఆపరేషన్ కు తాము సిద్దమవుతున్నామని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ పై ఇరాన్ శనివారం రాత్రి 300 కుపైగా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇరాన్ పై ఇజ్రాయెల్ ఏ క్షణంలోనైనా దాడి చేయొచ్చని అమెరికా నిఘా వర్గాలు కూడా అంటున్నాయి. ఇప్పుడు స్పందించకుండా మౌనం వహిస్తే భవిష్యత్తులో ఇరాన్ నుండి మరింత ముప్పు ఏర్పడే అవకాశం ఉందని టెల్ అవీవ్ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ప్రతిదాడి విషయంలో ఇజ్రాయెల్ ను నిర్దేశించలేమని, నచ్చిన నిర్ణయం తీసుకునే స్వేచ్చ ఆ దేశానికి ఉందని అమెరికా తెలిపింది.
అగ్రరాజ్యం అండగా నిలిచినా, నిలవకపోయినా .. ఇరాన్ పై ప్రతి దాడి విషయంలో ముందుకే వెళ్లాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సహా మంత్రిమండలి లో ఎక్కువ మంది భావిస్తున్నారు. ఇదే విషయాన్ని సోమవారం అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిస్ కు చెప్పినట్లు సమాచారం. తాము ప్రతి దాడి చేయడం తప్ప మరో మార్గం లేదని అస్టిస్ తో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గలాంట్ పేర్కొన్నట్లు తెలుస్తొంది.
ఇరాన్ విషయం తేలే వరకూ గాజాలోని అషాపై ఆపరేషన్ ను నిలిపివేయాలని నెతన్యాహూ నిర్ణయించినట్లు తెలుస్తొంది. ప్రతిదాడికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టెహ్రాన్ హెచ్చరించింది.
మరో వేపు ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడిపై చర్చించేందుకు అత్యవసరంగా సమావేశమైన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. సంయమనం పాటించాలని ఇరుపక్షాలకు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరస్ విజ్ఞప్తి చేశారు.
ఇరాన్ దాడి సమయంలో తాము ఇజ్రాయెల్ కు సాయం చేశామని సౌదీ అరేబియా తెలిపింది. ఇప్పటికే ఈ విషయాన్ని బొర్జాన్ బహిరంగంగానే అంగీకరించింది. శనివారం రాత్రి ఇజ్రాయెల్ పై ఇరాన్ 300కి పైగా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. వీటిలో కొన్ని ఇరాక్ గగనతలంపై నుండి వెళితే.. మరి కొన్ని జోర్డాన్, సౌదీ గగనతలాల మీదుగా దూసుకువెళ్లాయి. తమ గగనతలం పైకి వచ్చిన వాటిని తాము నేలకూల్చామని సౌదీ అరేబియా తెలిపింది.
America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు