గుంటూరు, ఏప్రిల్ 9:గుంటూరు జిల్లాలో ఐటి దాడులు అధికార రాజకీయ పార్టీ నాయకుల్లో భయాందోళన కల్గిస్తున్నాయి.
మద్యాహ్నం టిడిపి ఎమ్మెల్యే యరపతినేని అనుయాయుడికి చెందిన ఆసుపత్రిలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
తాజాగా గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్ధి, సిట్టింగ్ ఎంపి అభ్యర్థి గల్లా జయదేవ్ ఆడిటర్ కార్యాలయంలో ఐటీ సోదాలు నిర్వహించారు. కార్యాలయంలోని రికార్డులను అధికారులు పరిశీలించడంతో పాటు జయదేవ్ బ్యాంక్ అకౌంట్లను ఐటి అధికారులు పరిశీలించారు.
ఆడిటర్ను రహస్య ప్రదేశానికి ఐటి శాఖ అధికారులు తరలించారు. గల్లా జయదేవ్ టిడిపి నేతలతో కలిసి ఆందోళన నిర్వహించడంతో ఐటి అధికారులు ఆడిటర్ను వదిలివేసినట్లు సమాచారం. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఏకపక్షంగా ఐటి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారని గల్లా ఆరోపించారు.
.