ప్రశాంతంగా ఉన్న వైకాపాలో రఘురామకృష్ణంరాజు చేసిన అలజడి అంతా ఇంతా కాదనే చెప్పాలి! జగన్ తన గుండెల్లో ఉన్నారు.. వైఎస్సార్ నా దేవుడు.. జగన్ అంతకుమించిన దేవుడు అంటూనే… వైకాపాకు వ్యతిరేకంగా చేయాల్సినవి అన్నీ చేసేస్తున్నారు రఘురామకృష్ణంరాజు! ఈ క్రమంలో ఈయన చేసినపనివల్ల ఎవరుకాస్త తేడాగా కనిపించినా వారిపై నిఘా పెట్టాల్సిన పరిస్థితి వైకాపా అధినేత జగన్ కు వచ్చిందనే చెప్పాలి! ఈ పరిస్థితుల్లో అలా నిఘా పెట్టించుకునే లెక్కల్లోకి వచ్చారు ఉత్తరాంధ్రకు చెందిన మరో వైకాపా ఎంపీ!
గతకొన్ని రోజులుగా బీజేపీ వైపు కోర చూపూ, ఓర చూపు లేకుండా కళ్లల్లోకి కళ్లుపెట్టి చూసే చూపు చూస్తున్నారు నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఈయన ప్రస్తుతం ఢిల్లీలో బీజేపీ నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. దానికి… ఢిల్లీలో మంత్రులతో పనిచేయించుకోవాలంటే తిరగాల్సింది బీజేపీ నేతలతో కాక మరెవరితో… అనేది ఆయన సమాధానం! ఈ క్రమంలో ఈ ఉత్తరాంధ్ర వైకాపా ఎంపీ టీడీపీ నేతలతో రాసుకుపూసుకు తిరుగుతున్నారంట. దీంతో జగన్ ఇప్పుడు ఈయనపై నిఘాపెట్టారని తెలుస్తోంది.
ఏమాత్రం రాజకీయాల్తో పెద్దగా సంబందం లేని ఆ వ్యక్తికి పార్టీలోకి తెచ్చి టికెట్ ఇప్పించిన తర్వాత… ఊసరవెల్లి వేషాలు వేస్తుంటే.. ఉత్తరాంధ్రా జిల్లాల వైసీపీ ఇంచార్జి విజయసాయిరెడ్డికి ఎక్కడమండాలో అక్కడ మండుతుందని అంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీలో క్రమశిక్షణగా ఉండాల్సింది పోయి.. సైకిల్ పార్టీ ఎంపీలతో సరదాలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఈయనకు కార్యకర్తలపైనా.. పార్టీపైనా ఎలాంటి ప్రేమా, కృతజ్ఞత వంటివి ఏమీ లేవని… వ్యాపారాల మీదే ఈయన ద్య్యాసంతా ఉందని చెప్పుకుంటున్నారట.
రోజు రోజుకీ బలపడుతున్న జగన్ విషయంలో.. జనాల్లో ఉన్న నమ్మకం దృష్ట్యా పార్టీలో ఎవరు తోకజాడించినా పార్టీ చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. ఉదాహరణ రఘురామకృష్ణంరాజే! ఈ విషయంలో పార్టీ వ్యవహారాలు అయినప్పటికీ… జనం కూడా జగన్ ని వెనకేసుకొస్తున్న పరిస్థితులు! మరి ఏ ధైర్యంతో ఈ కొత్త ఎంపీ గారు ఆ సహసానికి ఒడిగట్టారో తెలియాలంటే కాస్త ఆగాలి మరి!!