వచ్చే ఎన్నికలకు సంబంధించి వైసీపీ మార్పుల వ్యూహం చేపట్టిన విషయం తెలిసిందే. ఉన్నవారిని వేరే చోటకు.. వేరే చోట ఉన్న వారిని ఇంకో చోటకు తరలించింది. ఈ ప్రయోగం ద్వారా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత పోయి.. పార్టీ పరుగులు పెడుతుందని, గెలుపు గుర్రం ఎక్కుతుందని వైసీపీ ఆశిస్తోంది. ఇది ఏమేరకు సక్సెస్ అవుతుందనేది పక్కన పెడితే..ఆదిలోనే కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో యూటర్న్ తీసుకోక తప్పదని అంటున్నారు.
ఉదాహరణకు ఉమ్మడి విశాఖపట్నంలోని రెండు కీలక నియోజకవర్గాల్లో చేసిన మార్పులు వైసీపీకి మైనస్గా మారాయని అంటున్నారు. వీటిలో ఒకటి గాజువాక, రెండో నియోజకవర్గం అనకాపల్లి. ఈ రెండు కూడా వైసీపీ కి చాలా ప్రత్యేకమైన నియోజకవర్గాలు. గాజువాకలో ఏకంగా జనసేన అధినేత పవన్ ను ఓడించిన తిప్పల నాగిరెడ్డి ఉన్నారు. ఇక, అనకాపల్లిలో ఫైర్ బ్రాండ్ నాయకుడు, మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. అయితే.. రెండో జాబితాలో వైసీపీ వీరిని మార్చేసింది.
ఈ రెండు నియోజకవర్గాల్లోనూ అనూహ్యమైన మార్పులు చేసింది. గాజువాక నుంచి కార్పొరేటర్ స్థాయి నాయకుడు.. ఉరుకూటి రామచంద్రరావును, అనకాపల్లి నుంచి సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. మలసాల భరత్ కుమార్ను ప్రకటించింది. ఈ మార్పుపై కొంత అసంతృప్తి వ్యక్తమైనా.. అధిస్టానం పెద్దగా పట్టించుకోలేదు. తాము చేసిన మార్పులకు కట్టుబడి ఉండాలని సంకేతాలు పంపించింది. దీంతో సిట్టింగులు సైలెంట్ అయ్యారు. కానీ, కొత్తగా వచ్చిన ఇంచార్జ్లు పుంజుకోలేక పోతున్నారు.
ఇద్దరూ కూడా.. బలమైన నాయకులుగా ఎదగలేక పోతున్నారనే వాదన ఉంది. అంతేకాదు.. క్షేత్రస్థాయి లో ప్రజల నుంచి కూడా బలమైన గుర్తింపును పొందలేక పోతున్నారు. పార్టీలో కార్యకర్తలను కూడా సమ న్వయ పరచడంలో ఫిఫ్టీ-ఫిఫ్టీగానే వ్యవహరిస్తున్నారు. పైగా.. టీడీపీ-జనసేన కూటమిని తట్టుకునే సామ ర్థ్యం వీరికి ఉంటుందా? అనే సందేహాలు వస్తున్నాయి. దీనిపై పార్టీ కూడా దృష్టి పెట్టినట్టు సమాచారం.
ఎందుకంటే.. ఏ చిన్న తేడా వచ్చినా.. ప్రజల్లో పుంజుకోకపోయినా.. అంతిమంగా పార్టీకి ఈ రెండు సీట్లు పోయే చాన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలో తిరిగిఇప్పుడున్న నాయకులకే అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని.. అంటున్నారు పరిశీలకులు. ఇక, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డికూడా.. వేచి చూస్తున్నారు. మరి పార్టీ అధినేత సీఎం జగన్ ఏం చేస్తారో చూడాలి.