వైసీపీ ముఖ్య నాయకుడు, సీఎం జగన్కు చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డికి భారీ షాక్ తగిలిందనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఈయన తన కుమారుడు విక్రాంత్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని కొన్నాళ్లుగా కోరుతున్నారు. మొదట్లో ఆయనకు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. అయితే.. అనూహ్యంగా సీఎం జగన్ ప్లేట్ మార్చారని తెలుస్తోంది. విక్రాంత్ రెడ్డిని కేవలం పార్టీకే పరిమితం చేయడంతోపాటు.. ప్రకాశం జిల్లా ప్రచార పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించే ప్రయత్నంలో ఉన్నారని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి విశేష సేవలందించిన వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసింది. వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డికి ఒంగోలు సీటు కేటాయిస్తారని యేడాది ముందు నుంచే ప్రచారం జరిగింది. రకరకాల సామాజిక సమీకరణాలు తెరపైకి రావడంతో విక్రాంత్ రెడ్డికి ఎంపీ టిక్కెట్ ఇవ్వలేకపోయినట్టు తెలుస్తోంది.
ఉన్నత విద్యను అభ్యసించిన విక్రాంత్రెడ్డి 2014లో తన తండ్రి వైవీ తరఫున ఒంగోలు పార్లమెంటు నియో జకవర్గంలో ప్రచారం చేశారు. అదేవిధంగా పలు సర్వేలు కూడా చేయించి.. తన తండ్రి గెలుపునకు సహ కరించారు. అయితే.. అప్పట్లో కొన్ని ఆరోపణలు రావడంతో ఆయనను పక్కన పెట్టారు. 2019లోనూ విక్రాం త్ కోసం వైవీ ప్రయత్నించారు. అప్పట్లోనూ టికెట్ దక్కలేదు. ఈ దఫా ఖచ్చితంగా టికెట్ దక్కుతుందని ఆశించారు. అయితే.. అది కూడా తప్పిపోయింది. జగన్ కూడా విక్రాంత్ నీ ఫ్యూచర్ నాది.. ఈ సారి ఖచ్చితంగా సీటు వస్తుందని ఎప్పుడో హామీ ఇచ్చారు.
జగన్ ఇచ్చిన హామీ దెబ్బకు విక్రాంత్ కూడా మురిసిపోయి ఈ దఫా ఎన్నికల్లో పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి తన తండ్రికి రాజ్యసభ సీటు ఇవ్వడంతో పాటు ఒంగోలు పార్లమెంటు సీటును చెవిరెడ్డికి దాదాపు ఖరారు చేయడంతో విక్రాంత్కు ఎక్కడా సీటు లేకుండా పోయింది. వైవీ సొంత అసెంబ్లీ నియోజకవర్గం అద్దంకి ఉన్నా అక్కడ సమీకరణల దృష్ట్యా పోటీ చేసేందుకు వీరు ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా ప్రచార పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
జిల్లాపై పూర్తి పట్టు పెంచుకున్న విక్రాంత్ వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయరు. కానీ, వారి గ్రాఫ్ ఎలా ఉందనేది మాత్రం ఎప్పటికప్పుడు పరిశీలించి, అంచనా వేసి వారికి ఎప్పటికప్పుడు సమాచారం పంపిస్తుంటారు. తద్వారా.. అభ్యర్థుల లోటుపాట్లను ఆయన హెచ్చరిస్తారు. ఫలితంగా ప్రతిసీటుపైనా పక్కా పట్టు సంపాయించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.