అమరావతి: వరద సహాయక చర్యలో జనసైనికులు పాల్గొనాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జనసేన పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన తూర్పు గోదావరి జిల్లా పర్యటన చేపట్టారు. హైదరాబాదు నుండి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుండి ర్యాలీగా సిద్ధాతం మీదుగా భీమవరంకు బయలు దేరారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసైనికులను ఉద్దేశించి కొద్ది సేపు మాట్లాడారు.
భారీ వర్షాలు, గోదావరి వరదల కారణంగా అనేక గ్రామాలు ముంపుకు గురై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనీ, జనసైనికులు ముంపు గ్రామాలలో పర్యటించి ప్రజలకు అండగా నిలవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్ తొలిసారిగా జిల్లాకు వచ్చారు. సాయంత్రం ఆరు గంటలకు భీమవరంలో ముఖ్య నేతలో వవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.
రేపు ఉదయం 10గంటలకు తాడేరుకు చెందిన దివంగత పార్టీ కార్యకర్త కొప్పినీడు మురళి కుటుంబాన్ని పరామర్శిస్తారు. మురళి కొద్ది రోజుల క్రితం క్యాన్సర్ వ్యాధితో మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం పవన్ నరసాపురం వెళతారు. మధ్యాహ్నం నరసాపురం పార్లమెంటర్ నియోజకవర్గ సమీక్షలో పాల్గొంటారు.