(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉదయం 9:30 గంటలకు కేంద్ర మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేయడంతో రాజకీయవర్గాలలో ఊహాగానాలు మొదలయ్యాయి. జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి మోదీ ప్రభుత్వం ఏదో ఒకటి చేయబోతున్నదన్న పుకార్ల మధ్య ఈ క్యాబినెట్ మీటింగ్ వార్త వెలువడింది. దానితో ఆ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారన్న ఊహాగానాలు ప్రారంభమ్యయాయి.
కొద్ది రోజులుగా జమ్ము కశ్మీర్లో కేంద్రం భద్రతాబలగాల మోహరింపు ఎక్కువ చేసింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 35 వేల మంది వరకూ కేంద్ర బలగాల జవాన్లు ఉన్నారు. రెండు రోజుల క్రితం టెరరిస్టుల ముప్పు పొంచిఉన్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు చెప్పాయంటూ అమరనాధ్ యాత్రను అర్ధంతరంగా నిలిపివేసి యాత్రికులను వెనక్కువెళ్లాలిసిందిగా ఆదేశించారు. దీనితో కశ్మీర్ లోయలో పుకార్లు రాజ్యం ఏలడం ప్రారంభమయింది. తనను కలిసిన రాజకీయ పార్టీల ప్రతినిధిబృందాలతో గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఈ రోజుకు ఏమీ లేదని చెప్పారు తప్ప పుకార్లను ఖరాఖండీగా కొట్టివేయలేదు.
మరో పక్క కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ అరవింద్ కుమార్, రా చీఫ్ సామంత్ గోయల్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబాలతో సమావేశమయ్యారు.
జమ్ము కశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370, కశ్మీర్లో శాశ్వత నివాసులకు ప్రత్యేకహక్కులు కల్పిస్తున్న రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా రాజ్యాంగంలో చేరిన ఆర్టికల్ 35ఎ రద్దు దిశగా మోదీ ప్రభుత్వం పయనిస్తున్నదా అన్న ప్రశ్నలు వినబడుతున్నాయి. ఈ రెండిటినీ బిజెపి బహిరంగంగా వ్యతిరేకిస్తున్నది. ఆర్టికల్ 35ఎ రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ ఇటీవల సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలయింది. కోర్టు దానిపై ఈ నెలలోనే విచారణ చేపట్టే అవకాశం ఉంది.
రాజకీయ వర్గాలలో వినబడుతున్న మరో మాట జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడం. బిజెపి ప్రభుత్వం రాష్ట్రాన్ని విడదీసి జమ్ము, లద్దాఖ్, కశ్మీర్ రాష్ట్రాలుగా ఏర్పాటు చేయనున్నదనే మాట కూడా వినబడుతున్నది. అధికార వర్గాల నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో ఊహాగానాలు మరింత విజృంభిస్తున్నాయి. జమ్ము కశ్మీర్కు సంబంధించి కేంద్రం ఏదో చేయబోతున్నదన్న మాట మాత్రం బలంగా వినబడుతోంది. అలాంటి తరుణంలో కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుండడం సహజంగానే రకరకాల ఊహాగానాలకు ఆస్కారం ఇస్తోంది.