ఏపీలో టీడీపీ – జనసేన పొత్తు ఎన్నికలకు ముందే చిత్తవుతుందా ? జనసేన వార్నింగ్లు, డిమాండ్లతో అసలు ఈ పొత్తు కంటిన్యూ అవుతుందా ? అంటే రకరకాల సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటి వరకు జనసేన పొత్తులో భాగంగా 25 – 30 సీట్లలో పోటీ చేస్తుందని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు జనసేన ఏకంగా 50 – 60 సీట్లు కేటాయించకపోతే కాపు ఓటు బ్యాంకు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వదన్న కొత్త డిమాండ్కు తెరదీస్తోంది. ఈ విషయంలో కాపు నేత, మాజీ హోం మంత్రి చేగొండి హరిరామ జోగయ్య అయితే చంద్రబాబు, టీడీపీని పదే పదే బెదిరింపులు చేస్తూ జనసేనకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని లేఖాస్త్రాలు సంధిస్తూ వస్తున్నారు.
మొన్నటికి మొన్న జనసేనకు 70 సీట్లు, 7-8 ఎంపీ సీట్లు ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ జోగయ్య లేఖలు రాశారు. జోగయ్య ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నా జోరీగలా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు అసలు పొత్తు ఆయనకు ఇష్టం ఉందో లేదో కాని ఇప్పుడు మరో లేఖాస్త్రం సంధిస్తూ పొత్తును గందరగోళంలో పడేస్తున్నారు. అందుకే ఇప్పుడు 50 – 60 సీట్లు కావాలని ఆయన ఓ పేద్ద లేఖ రాశారు. పైగా జనసేన / కాపుల ఓట్లు టీడీపీకి ట్రాన్స్ ఫార్ అవ్వదూ అంటూ ఆయన ఓ స్వీట్ వార్నింగ్లు ఇస్తోన్న పరిస్థితి కూడా కనిపిస్తోంది.
కొద్ది రోజుల క్రితమే జోగయ్య జగన్ను సీఎం కుర్చీనుంచి దించేద్దాం అంటే చంద్రబాబును సీఎం కుర్చీ ఎక్కించడమేనా ? అని కూడా పవన్ను నిలదీస్తున్నారు. ఇక సీఎం పవర్ షేరింగ్ ఖచ్చితంగా పవన్కు రెండున్నరేళ్లు ఉండాలని కూడా జోగయ్య డిమాండ్గా ఉంది. ఆయన తాజా లేఖలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ సీట్లలో 11 సీట్లు జనసేనకు ఇవ్వాలని చెప్పడం మరీ వార్నింగ్లా ఇవ్వడం గోదావరి టీడీపీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
కాపుల ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే నరసాపురం పార్లమెంటు సీటుతో పాటు ఏకంగా 11 అసెంబ్లీ సీట్లు జనసేనకు ఇవ్వాలట. ఇందులో తెలుగుదేశం పార్టీ కీలక నేతలు ప్రాథినిత్యం వహిస్తోన్న, ఇన్చార్జ్లుగా ఉన్న సీట్లు కూడా ఉన్నాయి. పైగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఉన్న పాలకొల్లుతో పాటు ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షలు గన్ని వీరాంజనేయులు ఇన్చార్జ్గా ఉన్న ఉంగుటూరు, టీడీపీ కంచుకోటలు తణుకు, కొవ్వూరు, నిడదవోలు కూడా ఇవ్వాలని జోగయ్య డిమాండ్గా ఉంది. మరి జోగయ్య లేఖను జనసైనికులు, ఇటు టీడీపీ వాళ్లు లైట్ తీస్కొని ముందుకు వెళతారా ? అన్నది చూడాలి.