Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు తాడేపల్లి మండల పరిధిలోని ఇప్పటం గ్రామంలో పర్యటించనున్నారు. పార్టీ ఆవిర్భావ సభకు ప్రాంగణం ఇచ్చారనే కక్షతో రోడ్డు విస్తరణ పేరిట ఇప్పటంలో ఇళ్లను కూలుస్తున్నారని పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గ్రామంలో బాధితులకు అండగా నిలిచేందుకు రేపు ఇప్పటం గ్రామాన్ని సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం వద్ద జనసేన కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. అక్కడ రోడ్డు మార్గం ద్వారా మంగళగిరికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. రాత్రి మంగళగిరిలో బస చేసి ఉదయం ఇప్పటం గ్రామాన్ని సందర్శించనున్నారు.
ఇప్పటం గ్రామంలో శుక్రవారం అక్రమ నిర్మాణాల కూల్చివేతను అధికారులు చేపట్టారు. ఈ సందర్భంలో కొందరు జనసేన కార్యకర్తలు ప్రతిఘటించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కూల్చివేతలు రాజకీయ ప్రతీకారంతోనే జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరగడం, జనసేన నేతలు ఆరోపణల నేపథ్యంలో మంగళగిరి – తాడేపల్లి నగరపాలక సంస్థ దీనిపై వివరణ ఇచ్చింది. రోడ్ల విస్తరణ లో భాగంగా అక్రమ కట్టడాలను కూల్చివేతకు చర్యలు చేపడితే అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారంటూ పేర్కొంది. అభివృద్ధి పనుల్లో బాగంగా మెయిన్ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాల కోసం గతంలోనే టౌన్, విలేజర్ సర్వేయర్లు సమక్షంలో సర్వే జరిగిందనీ, ఆ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా మొత్తం 53 అక్రమ కట్టడాలను గుర్తించి సరిహద్దులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అక్రమ కట్టడాలదారులకు ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే షో కాజ్ నోటీసులు జారీ చేశారనీ, వారం రోజుల్లో వాటిని తొలగించాలని నోటీసులో పేర్కొనడం జరిగిందన్నారు. ఆ తర్వాత మే నెలలో మరో సారి నోటీసులు పంపించారని అయినా వారి నుండి స్పందన లేకపోవడంతో పోలీసుల సహకారంతో అక్రమ కట్టడాలను తొలగించే యత్నం చేయడం జరిగిందని అధికారులు చెబుతున్నారు.
‘కూల్చివేతల ప్రభుత్వం కూలిపోతుంది’
మనకు అనుకూలంగా ఓటు వేసిన వారే మన వాళ్లు.. ఓటు వేయని వారు శత్రువులు,. వారి పీచమణిచేద్దామని పాలన చేస్తే రాక్షస రాజ్యమే ఆవిష్కృతమవుతుందని విమర్శించారు పవన్ కళ్యాణ్. ఏపిలో ప్రస్తుతం జరుగుతున్న పాలన నూటికి నూరు శాతం మన వారు కాని వారిని తొక్కి నార తీయండి అనే విధంగా కొనసాగుతోందని అన్నారు. పాలకులు తమకు ఓటువేసిన 49.95 శాతం ఓటర్లకు మాత్రమే పాలకులం అని భావిస్తున్నట్లుగా వారి చర్యలు చూస్తే అర్ధం అవుతోందని పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణే శుక్రవారం ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ పేరిట సాగుతున్న ఆరాచకమని ధ్వజమెత్తారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామస్తులు జనసేన మద్దుతుదారులు కావడమే వైసీపీ ప్రజా ప్రతినిధుల ఆగ్రహానికి కారణమని అన్నారు. మార్చి 14న జనసేన ఆవిర్భావ సభకు చోటిచ్చి సహకరించడమే స్థానిక ప్రజాప్రతినిధి ఆగ్రహానికి కారణమని పేర్కొన్నారు. మార్చి 14న సభ జరిగిన తర్వాత ఏప్రిల్ నెలలో రోడ్ల విస్తరణ అంటూ నోటీసులు ఇచ్చారన్నారు.
ఈ గ్రామం ప్రధాన రహదారికి కాస్త పక్కగా రాకపోకలకు దూరంగా ఉంటూ ప్రశాంతంగా ఉండే ఊరు. ఈ గ్రామం మీదుగా రాకపోకలు ఉండవు కానీ ఇప్పటికే గ్రామంలో 70 అడుగుల రోడ్డు ఉందన్నారు. దీనిని ఇప్పుడు 120 అడుగుల రోడ్డు విస్తరించి గ్రామానికి అదనపు హంగులు తెచ్చేయాలని స్థానిక ప్రజా ప్రతినిధి ఉవ్విళ్లూరుతున్నారన్నారు. ఆయన ఉత్సాహానికి కారణం కేవలం కక్ష సాధింపేనన్నారు. ఆ వంకతో తనకు ఓటువేయని వారి ఇళ్ల తొలగింపు ప్రక్రియను పోలీసు బలగాల సాయంతో చేశారని ఆరోపించారు. కూల్చివేత నోటీసులపై గ్రామస్తులంతా హైకోర్టును ఆశ్రయించారన్నారు. దాంతో ఆఘమేఖాల మీద కూల్చివేతలు చేపట్టారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కూల్చివేతలతో పాలన ప్రారంభించిన ఈ ప్రభుత్వం కూలిపోయే రోజు ఎంతో దూరం లేదని ప్రకటనలో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటం వాసులకు జనసేన అండగా నిలబడుతుందని పవన్ అన్నారు.