TDP: ఏపీలో మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. నిన్నటి నుండి నామినేషన్ల స్వీకరణ పర్వం కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు విస్తృత ప్రచారాలు చేస్తున్నారు. అభ్యర్ధులు ఇంటింటి ప్రచారాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యర్ధి పార్టీలోని అసంతృప్తులను పార్టీలో చేర్చుకుంటున్నారు. పార్టీ కండువాలు కప్పుతున్నారు.
దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో చేరికల పర్వానికి అభ్యర్ధులు తెరలేపారు. ప్రత్యర్ధులను బలహీనపర్చి, తమ బలాన్ని పెంచుకునేందుకు అభ్యర్ధులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీల్లోని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, ఆభ్యర్ధుల బంధువర్గాన్ని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలో మైలవరం నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ కు షాక్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి వసంత కృష్ణప్రసాద్. గత ఎన్నికల్లో పెడన నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి జగన్ క్యాబినెట్ లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న జోగి రమేష్ ఈ సారి పెనమలూరు నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. జోగి రమేష్ సొంత ప్రాంతం (ఇబ్రహీంపట్నం) మైలవరం నియోజకవర్గం కావడంతో ఆయనకు బలమైన వర్గం ఉంది.
ఇక్కడ నుండి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వసంత కృష్ణప్రసాద్, జోగి రమేష్ మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో వైసీపీ మైలవరం టిక్కెట్ కృష్ణప్రసాద్ కు రాకుండా ద్వితీయ శ్రేణి నాయకుడు తిరుపతిరావు యాదవ్ కు ఇచ్చింది. దీంతో వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరారు. టీడీపీ మైలవరం అభ్యర్ధిగా బరిలో నిలుస్తున్నారు. ఈ క్రమంలో జోగి రమేష్ పట్ల, వైసీపీ పట్ల వ్యతిరేకంగా ఉన్న వారితో సంప్రదింపులు జరిపి టీడీపీ కండువాలు కప్పుతున్నారు వసంత కృష్ణప్రసాద్.
తాజాగా ఇవేళ జోగి రమేష్ సొంత బావమరుదులను టీడీపీలో చేర్చుకుని పార్టీ కండువాలు కప్పారు. వసంత కృష్ణ ప్రసాద్ సమక్షంలో 40 మంది జోగి రమేష్ బంధువులు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. జోగి రమేష్ బావమరుదులైన పామర్తి దుర్గాప్రసాద్, పామర్తి దుర్గారావు, పామర్తి వెంకటేశ్వరరావు తదితరులు టీడీపీలో చేరిన వారిలో ఉన్నారు. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటి ముందే సభా వేదిక ఏర్పాటు చేసి మరీ వీళ్లంతా టీడీపీలో చేరడం నియోజకవర్గ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు